జ‌గ‌న్‌ పై ప‌రోక్షంగా దుమ్మెత్తిపోసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తెలుగు ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఓ పిలుపునిచ్చారు. తెలుగును బతికిద్దాం.. తెలుగువారిగా జీవిద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు వారికి తన పక్షాన, జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వాడుక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవ డం తెలుగువారి సౌభాగ్యమని పవన్ అన్నారు. గ్రాంథికంలో ఉన్న తెలుగును వాడుక భాషగా మార్చి అందరికీ చేరువయ్యే లా చేసిన ఘనత గిడుగు వంటి మహానుభావులదైతే .. ఈనాటి పాలకులు తెలుగును కనుమరుగు చేసే అనాలోచిత చర్యలకు ఉపక్రమిస్తున్నారన్నారు.

‘కొండ నాలుకకు మందేస్తే ఉన్ననాలుక పోయింది’ అనే రీతిలో కొంద‌రు పాల‌కులు(జ‌గ‌న్‌ను ఉద్దేశించి అని విశ్లేష‌కుల భావ‌న‌) వ్యవహరిస్తున్నారని జనసేన అధినేత ఆరోపించారు. ఓట్ల వ్యామోహంలో వైసీపీ నాయకులు కొట్టుకుపోతున్నారని విమర్శించారు. తెలుగు భాషకు సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే గుండె బరువెక్కక మానదని ఆవేదన చెందారు. ఒకప్పుడు దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలుగు ఇప్పు డు ఐదో స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య 27 శాతం మించి లేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో అయిదు దశాబ్దాలలో తెలుగు అంతరించిపోతున్న భాషల పట్టికలో చేరిపోయే ప్రమాదం ఉందని భాషాభిమానులు ఆవేదన చెందుతున్నారన్నారు.

మాతృ భాషతోనే సంస్కృతి సంప్రదాయాలు పరిఢవిల్లుతాయన్న పెద్దల మాటలను విస్మరించరాదని హితవు పలికారు. భాష అంతరించిపోతే జాతి మొత్తం అంతరించిపోతుందన్నారు. మన అమ్మ భాషను బతికించుకోడానికి తెలుగు వారందరూ నడుంకట్టాలని పిలుపునిచ్చారు. పాలకులు ఏదో చేస్తారులే అన్న భావం విడనాడాలన్నారు. భాషాభిమానులు, స్వచ్చంధ సంస్థలు ముఖ్య భూమిక పోషించాలని.. భాషాభ్యున్నతికి చర్చా గోష్టులు, సమ్మేళనాలు నిర్వహించాల్సి ఉందన్నారు.. భాషాపరమైన గ్రంథాల ముద్రణకు ముందుకు రావాలని.. ఊరికో తెలుగు భాషా సంఘం ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. మొత్తానికి అవ‌కాశం ఎలా వ‌చ్చినా.. జ‌గ‌న్‌ను విడిచిపెట్ట‌కుండా..రాజ‌కీయంగా విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.