టీటీడీ ఆస్తుల అమ్మకంపై సంచలన నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 50 ఆస్తుల వేలం వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రాజకీయంగా పెను దుమారం రేగింది. దీంతో, ఆ ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విక్రయంపై నిషేధం విధించాలని టీటీడీ బోర్డు తీర్మానించింది. ఆన్ లైన్లో జరిగిన టీటీడీ ట్రస్టు బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు ఛైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

ఇటీవల భూముల వేలానికి సంబంధించి చెలరేగిన వివాదం నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని వైవీ తెలిపారు. టీటీడీ ఆస్తుల పరిరక్షణకు బోర్డ్ సభ్యులు, స్వామీజీలతో కమిటీ వేశామని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా.. సెంటిమెంట్ కు ఇబ్బంది లేకుండా చూస్తామని వైవీ వెల్లడించారు.

భూముల అమ్మకాలపై చెలరేగిన వివాదం పై విచారణ జరిపిస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ రాజకీయ కుట్ర వెనుక బోర్డ్ సభ్యులు ఉన్నారా..లేక టిటిడి ఉద్యోగులు ఉన్నారా అనే దానిపై విచారణ జరిపిస్తామన్నారు. డొనేషన్లు ఇచ్చిన వారికి నామినేషన్ వేయించి అర్హత ఉన్నవారికి మాత్రమే గెస్ట్ హౌజులు కేటాయిస్తున్నామన్నారు. తిరుపతిలో రూ.20 కోట్లతో వంద పడకల చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది.

టీటీడీ విద్యా సంస్థల్లో టీటీడీ ఉద్యోగుల పిల్లలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానించింది. ఏపీ, తెలంగాణలో 8 ఆలయాలను దత్తత తీసుకోవాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా గురువారం టీటీడీ బోర్డు మీటింగ్‌ను వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో నిర్వహించారు. టీటీడీ ఆస్తుల అమ్మకాలు జరపాలని 2016 జనవరి 30వ తేదీన జరిగిన సమావేశంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బోర్డు నిర్ణయం తీసుకుంది.

ఈ విషయమై భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని టీటీడీ పున:పరిశీలించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. భక్తులను, మత పెద్దలను సంప్రదించి, ఆ ఆస్తులను దేవాలయాలకు, ధర్మ ప్రచారానికి టీటీడీ ఉపయోగించుకోవచ్చునేమో పరిశీలించాలని జిఓ 888లో పేర్కొంది. ఈ విషయమై తుది నిర్ణయం జరిగేవరకు సదరు 50 ఆస్తుల అమ్మకానికి సంబంధించిన ప్రతిపా దనను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.