ఇంటి ముందు టూలెట్ బోర్డు.. జరిమానా వేసిన జీహెచ్ఎంసీ

మీ ఇంటి ముందు.. మీ అపార్ట్ మెంట్ ముందు.. ఇల్లు అద్దెకు ఉందని పెట్టే బోర్డు.. లేదంటూ చిన్నపాటి ఫ్లెక్సీకి ఫైన్ వేస్తే? ఇదెక్కడి అన్యాయమండి? అంత పెద్ద తప్పేం జరిగిందండి? ఇల్లు అద్దెకు ఉందని.. ఎవరికైనా ఎట్లా తెలుస్తుందండి? లాంటి క్వశ్చన్లు మందిలోకి వస్తున్నాయా? ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే.. వాటితో సంబంధం లేకుండా తమ పని తాము చేసుకుపోవటం జీహెచ్ఎంసీ గొప్పతనం. ఇప్పటివరకు ఎప్పుడూ వినని.. చూడని రీతిలో ఫైన్లు వేస్తూ షాకిస్తోంది.

తాజాగా ఇల్లు అద్దెకు ఇస్తామంటూ.. ఇంటి ముందు తగిలించిన ఒకమోస్తరు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే.. దానికి ఫైన్ వేసి దిమ్మ తిరిగిపోయేలా చేశారు. ఎందుకిలా? అంటే.. అనుమతి లేకుండా ఏర్పాటు చేశారంటూ బదులివ్వటం గమనార్హం. అనుమతి లేకుండా ఏర్పాటు చేసే బహిరంగ ప్రచారాల మీద నిషేధం ఉందంటూ మరో ఆసక్తికరమైన విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. సదరు ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఇంటి యజమానికి రూ.2వేలు ఫైన్ వేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఇదిప్పుడు షాకింగ్ గా మారింది. ఇంతకూ ఈ వ్యవహారం ఎక్కడ చోటు చేసుకున్నదంటే..

మోతీనగర్ పరిధిలోని మూసాపేట డివిజన్ లోని ఒక దుకాణా యజమాని ఏర్పాటు చేసిన టూలెట్ బోర్డుకు జీహెచ్ఎంసీ అధికారులు రూ.2వేలు ఫైన్ వేశారు. స్థానిక వ్యాపారి లాలయ్యగౌడ్ కు చెందిన ఇల్లు ఖాళీ అయ్యింది. దీంతో.. టూ లెట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఇది నేరమంటూ జీహెచ్ఎంసీ ఈడీ.. డీఎం డైరెక్టర్ రూ.2వేలు జరిమానా విధిస్తూ మంగళవారం నోటీసులు జారీ చేసింది.

అంతేకాదు.. 24 గంటల వ్యవధిలో ఈ – చలానా ద్వారా ఫైన్ పే చేయాలని చెప్పటం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ లెక్కన హైదరాబాద్ మహానగరంలో టూలెట్ బోర్డులు ఏర్పాటు చేసినోళ్ల వేలాది మంది పరిస్థితి ఏమిటి? మరి.. టూలెట్ బోర్డు పెట్టాలంటే ఎలాంటి పర్మిషన్లు తీసుకోవాలి? అందుకు ఎంత తిరగాలి? లాంటి ప్రశ్నల్ని సంధిస్తున్నారు. మొత్తానికి జీహెచ్ఎంసీ తీరు షాకింగ్ గా మారింది.