యూఎస్ వీసా.. ఇండియన్ స్టూడెంట్స్ ఆల్ టైం రికార్డ్

ఉన్నత విద్య కోసం.. అమెరికా వెళ్లాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం చాలా మంది యూఎస్ వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. కొందరికి అతి సులభంగా వీసా లభించినా.. కొంత మంది మాత్రం ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం వల్ల వీసా సాధించలేరు. కాగా.. తాజాగా.. భారత విద్యార్థులకు అమెరికా బంపర్ ఆఫర్ ఇచ్చింది. అత్యధిక మంది భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసింది.

ఈ ఏడాదిలో ఇప్పటికే 55 వేల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఈ మేరకు అమెరికా ఎంబసీ అధికారులు తెలిపారు. కొవిడ్ విజృంభిస్తున్నప్పటికీ అమెరికాకు పయనమయ్యే భారత విద్యార్థుల కోసం అధిక సంఖ్యలో వీసాలు జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు.

కరోనా సెంకడ్ వేవ్ వల్ల దాదాపు రెండు నెలల పాటు వీసా జారీ పక్రియలో జాప్యం జరిగింది. ఈ సమయంలో వీసా ఇంటర్వ్యూ ప్రక్రియను వాయిదా వేశారు. ఈ ఏడాది మే లో ప్రారంభం కావాల్సిన ఇంటర్వ్యూ ప్రక్రియ జులైలో ప్రారంభించాల్సి వచ్చిందని ఢిల్లీలోని అమెరికా అంబాసిడర్ అతుల్‌ కేశప్‌ అన్నారు.

భారతీయ విద్యార్థులకు ఓ సెమిస్టర్‌ సమయం వృథా కాకుండా ఉండేందుకే సాధ్యమైనంత త్వరగా వీసాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. వీసాల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేస్తున్న అమెరికా విదేశాంగ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా వీసాలు జారీ కానీ విద్యార్థులకు త్వరలోనే వీసాలు జారీ అవుతాయన్నారు.