యాక్టివ్ అయిన సోనియా

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కాస్త యాక్టివ్ అయినట్లే ఉన్నారు. అనారోగ్యకారణంగా సోనియా పార్టీ కార్యక్రమాలకు కూడా కాస్త దూరంగా ఉంటున్నారు. అలాంటిది శుక్రవారం 19 పార్టీల అధినేతలతో వర్చువల్ పద్ధతిలో సమావేశం నిర్వహించారు. దాదాపు 2 గంటలకు పైగా సాగిన సమావేశంలో పార్టీల వ్యక్తిగత అజెండాలను పక్కనపెట్టి కామన్ అజెండాతో నరేంద్ర మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపిచ్చారు.

పార్లమెంటు వేదికగా పెగాసస్ సాఫ్ట్ వేర్ , నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోరాడినట్లు పార్లమెంట్ బయట కూడా ఎన్డీయే సర్కార్ పై పోరాటాలు చేయవలసిన అవసరాన్ని ఈ సందర్భంగా సోనియా గుర్తుచేశారు. ఐకమత్యంగా ఉంటేనే కానీ 2024 ఎన్నికల్లో మోడిని ఎదుర్కోవడం సాధ్యం కాదని ప్రతిపక్ష నేతల్లో చాలామంది ఏకాభిప్రాయానికి వచ్చిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాల ఐక్యతకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముందు నడుం బిగించారు.

తర్వాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో శరద్ పవార్ తదితరులు భేటీ అయ్యారు. మమత-శరద్-ప్రశాంత్ ఆధ్వర్యంలో అనేక సమావేశాలు జరిగాయి. ఈ మధ్యనే ఢిల్లీలో మమత కూడా ప్రతిపక్షాల ఐక్యతా సమావేశాన్నినిర్వహించారు. ఈ సమావేశం సక్సెస్ అయ్యింది. ఇదే ఊపులో రాహుల్ గాంధీ కూడా ఓ సమావేశం నిర్వహిస్తే అదికూడా విజయవంతమైంది. అంటే మోడిని ఎలాగైనా ఓడించాలన్న బలమైన కోరిక ప్రతిపక్షంలో పెరిగిపోతున్న విషయం అర్థమవుతోంది. సెప్టెంబర్ 20-30 మధ్య దేశవ్యాప్తంగా ఐక్య నిరసనలు చేయాలని డిసైడ్ అయ్యింది.

ఇవన్నీ గమనించిన తర్వాతే తాజాగా సోనియా కూడా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 19 పార్టీల అగ్రనేతలు హాజరయ్యారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, మమత, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, ఎంకే స్టాలిన్, ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీ మహ్మద్ సయ్యద్, సీతారాం ఏచూరి, తేజస్వీయాదవ్, హేమంత్ సోరేన్ లాంటి కీలక నేతలంతా హాజరయ్యారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బిజీ కారణంగా అఖిలేష్ యాదవ్, మాయావతి లు హాజరు కాలేదు. మొత్తం మీద ప్రతిపక్షాల్లో వస్తున్న ఐక్యతను చూసిన తర్వాత మోడీ వ్యతిరేక ఫ్రంట్ బలంగా ఉండేట్లే అనిపిస్తోంది. చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.