75 ఏళ్ల‌లో మునుపెన్న‌డూ చూడ‌ని క్లిష్ట ప‌రిస్థితులు..

ఈ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ వేడుక‌ను అంద‌రూ ఎంతో ఘ‌నంగా.. మ‌రెంతో సంతోషంగా చేసు కుంటున్నారా? ఏటా నిర్వ‌హించుకునే తిరంగా పండుగ‌ను ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇంట్లో పండ‌గ‌గా చేసుకుంటున్నారా? అంటే.. కాద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో చేసుకున్న తిరంగా పండుగ‌ల‌కు.. ఇప్పుడు ఈ ఏడాది జ‌రుగుతున్న పంద్రాగ‌స్టు వేడుక‌కు మ‌ద్య భారీ వ్య‌త్యాసం వుంద‌ని.. చెబుతున్నారు.

దేశం ఇప్పుడు అత్యంత క్లిష్ట‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటోంద‌ని చెబుతున్నారు. పార్ల‌మెంటులో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. దేశ గౌర‌వాన్ని ఇనుమ‌డించ‌క‌పోగా.. మ‌రింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.

అదేస‌మ‌యంలో కేంద్రంలోని పాల‌కులు అవ‌లంభిస్తున్న తీరుతో దేశం మొత్తం.. ఆవేద‌న‌, ఆందోళ‌న‌ల‌తో నివ్వెర‌పోతోంది. పెరుగుతున్న ధ‌ర‌లు.. సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నాయి. ఏం తినేట‌ట్టు లేదు.. ఏం కొనేట‌ట్టు లేదు.. అన్న మాట వాస్త‌వ రూపంలో సాక్షాత్క‌రించిన ప‌రిస్థితిలో.. సామాన్యులు 75వ దేశ‌స్వాతంత్ర వేడుక‌ల‌కు దూరంగానే ఉంటున్నార‌నే వాద‌న వినిపి స్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశం జ‌రుపుకొన్న పంద్రాగ‌స్టు వేడుక‌లు ఒక ఎత్త‌యితే.. ఇప్పుడు జ‌రుగుతున్న వేడుక‌లు మ‌రో ఎత్తుగా ఉన్నాయి. అభివృద్ధి లేని దేశంగా న‌వీన భార‌తం.. ప‌రుగులు పెడుతోంది. అవినీతి ర‌హితం చేసి.. భార‌త‌దేశాన్ని వెలిగిపోయేలా చేస్తున్నామ‌న్న పాల‌కులు.. చేత‌ల్లో చూపుతున్న‌ది.. అక్ష‌రాలా.. మేడిపండు చంద‌మే!

ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ పాల‌కులు అనుస‌రిస్తున్న అధికార కాంక్షా రాజ‌కీయం.. రాష్ట్రాల హ‌క్కుల‌ను స్వ‌తంత్రాన్ని భారీ ఎత్తున దెబ్బ‌తీస్తోంది. రాష్ట్రాల‌కు రాజ్యాంగం ప్ర‌సాదించిన హ‌క్కుల‌ను కూడా మోడీ ప్ర‌భుత్వం ఇటీవల కాలంలో అప‌హ‌రించ‌డం.. ఉన్న హ‌క్కుల‌ను కూడా కాల‌రాసి.. కేంద్ర జోక్యం పెంచుకోవ‌డం.. రాష్ట్రాలు కేవ‌లం కేంద్రంపై ఆధార‌ప‌డి బ‌తికే జీవులుగా మార్చివేయ‌డం.. వంటివి.. దేశ 75వ స్వాతంత్ర దినోత్స‌వ వేళ ప్ర‌ధానంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తున్న అంశాలు.

నిజానికి ఇప్పుడున్నంత ఆధార‌ప‌డ‌డం అనే మాట‌.. గ‌తంలో రాష్ట్రాల‌కు లేదు. ప‌న్నుల ఆదాయం విష‌యంలో కేంద్రంపై ఆదార‌పడాల్సి రావ‌డం.. రాష్ట్రాల జాబితాలో ఉన్న విద్య‌, వైద్యం.. శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కూడా.. కేంద్రం ఒన్ నేష‌న్‌ పేరుతో.. త‌న అధీనంలోకి తీసుకోవ‌డం.. వంటివి నిజంగా.. భార‌త ప్ర‌జాస్వామ్యం ఏక వ్య‌క్తి స్వామ్యంగా మారుతోంద‌నే సందేహాలు వ‌చ్చేలా చేస్తోంది.

ఒక‌ప్పుడు.. రాష్ట్రాల‌కు-కేంద్రానికి మ‌ద్య సుహృద్భావ వాతావ‌ర‌ణం ఉండేది. కొన్ని నిర్ణ‌యాలు రాష్ట్రాలు స్వ‌తంత్రంగా తీసుకునేవి. కానీ, ఇప్పుడు.. అన్నింటికీ కేంద్రంపై నే ఆధార‌ప‌డాల్సిన ప‌రిస్థితి. రాష్ట్రాల ఆర్థిక ఇబ్బందుల‌ను ప‌ట్టించుకుని ప‌రిష్క‌రించే తీరిక కేంద్రానికి లేకుండా పోయింది.

అస‌లు కేంద్ర-రాష్ట్రాల మ‌ధ్య ఉన్న స్నేహం అనే చిరు గీత నేడు తొలిగిపోయి.. ‘పెత్త‌నం’ అనే పెద్ద‌గీత గీసేసిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. త‌మ‌కు అనుకూలంగా రాష్ట్రాల‌ను మ‌లుచుకోవ‌డం.. త‌మ మాట విన‌ని రాష్ట్రాల‌పై.. త‌మ‌కు అనుకూలంగా లేని రాష్ట్రాల‌పై.. నియంతృత్వ పోక‌డ‌లు పోవ‌డం.. వంటివి 75వ స్వ‌తంత్ర దినోత్స‌వం వేళ‌.. భార‌తావ‌ని ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌. అందుకే ఈ 75 ఏళ్ల‌లో ఇలాంటి క్లిష్ట‌ప‌రిస్థితులు ఎదుర్కొన‌లేద‌న్న‌ది వాస్త‌వం.. అంటున్నారు ప‌రిశీల‌కులు.