చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌నే నిజం చేసిన ఎంపీలు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా ఒక ప్ర‌క‌ట‌న చేస్తున్నారు. అదేంటంటే.. త‌న పార్టీకి ముగ్గురు మాత్ర‌మే ఎంపీలు ఉన్నా.. పాండ‌వుల‌తో స‌మాన‌మ‌ని.. గంగిగోవు లాంటి వాళ్ల‌ని.. వారి సేవ‌లు విస్తృతమ‌ని.. పార్ల‌మెంటులో సింహాల్లాగా పోరాడుతున్నార‌ని.. ఆయ‌న ప్ర‌క‌టిస్తున్నారు. ఇక‌, పార్టీ యువ నాయ‌కుడు, జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ కూడా.. ఇదే విష‌యాన్ని తిరుపతి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లోనూ ప్ర‌చారం చేశారు. సింహంలాంటి టీడీపీ ఎంపీలు.. అంటూ..ఆయ‌న చేసిన కామెంట్లు.. బాగానే వైర‌ల్ అయ్యాయి. అయితే..తిరుప‌తి ఉప ఎన్నిక‌లో ఫ‌లితంమాత్రం రివ‌ర్స్ అయింది అదివేరే సంగ‌తి అనుకోండి.

కానీ, గ‌త 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున విజ‌యంద‌క్కించుకున్న‌వారు కేవ‌లం ముగ్గ‌రంటే ముగ్గురే ఎంపీలు. వీరిలో శ్రీకాకుళం ఎంపీ.. రామ్మోహ‌న్ నాయుడు, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, గుంటూరు నుంచి గ‌ల్లా జ‌య‌దేవ్ విజ‌యం ద‌క్కించుకున్నారు. మిగిలిన 22 మంది వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించారు. అయితే.. టీడీపీకి ముగ్గురే ఉన్న‌ప్ప‌టికీ.. పార్ల‌మెంటులో వీరి ప‌నితీరుకు మంచి మార్కులే ప‌డ్డాయ‌ని.. గ‌తంలో చంద్ర‌బాబు చెప్పిన‌ట్టుగానే ఇప్పుడు తాజాగా వ‌చ్చిన ఓ స‌ర్వే కూడా స్ప‌ష్టం చేసింది. ఏపీ లోక్ సభ ఎంపీల పనితీరుకు సంబంధించి ఆసక్తికర నివేదిక ఒకటి వైరల్ అవుతోంది.

పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ఎంపీల పనితీరు, పార్లమెంట్‌ హాజరుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పార్లమెంట్ అధికారిక సమాచారం ప్రకారం ఏపీ ఎంపీల పనితీరును వివరించారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రెండో స్థానంలో నిలిచారు. ఆయన అటెండన్స్ 89శాతం కాగా.. 54 డిబేట్స్‌లో పాల్గొన్నారు.. 133 ప్రశ్నలు అడిగారు. మూడో స్థానంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఉన్నారు. ఆయన అటెండన్స్ 89శాతం, 14 డిబేట్స్‌లో మాత్రమే పాల్గొన్నారు.. 77 ప్రశ్నలు మాత్రమే అడిగారు. అంటే అటెండన్స్ విషయంలో గల్లా జయదేవ్ రెండు, కేశినేనాని మూడో స్థానంలో నిలిచారు.

డిబేట్ల విషయానికి వస్తే.. గల్లా జయదేవ్ 54, ఎంపీ రామ్మోహన్‌నాయుడు 49తో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. సో.. దీనిని బ‌ట్టి .. చంద్ర‌బాబు ఆశ‌ల‌ను, ఆయ‌న ల‌క్ష్యాల‌ను వీరు పూర్తిచేస్తున్నార‌ని.. టీడీపీ సీనియ‌ర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. బాబు శిక్ష‌ణ‌, నేతృత్వం అంటే ఇలానే ఉంటుంద‌ని.. కొనియాడుతున్నారు. త‌క్కువ మందే అయినా.. ఎక్కువ ఫ‌లితం రాబ‌డుతున్నార‌ని.. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై పార్ల‌మెంటులో కేంద్రాన్ని నిల‌దీస్తున్న వైనం..ఇప్పుడు గ‌ణాంకాల‌తో స‌హా నిరూపిత‌మైంద‌ని.. అంటున్నారు. భ‌విష్య‌త్తులోనూ ఇదే త‌ర‌హా.. వ్యూహంతో వ్య‌వ‌హ‌రించ‌డం ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. మొత్తం అన్ని పార్ల‌మెంటు స్థానాల్లోనూ టీడీపీ విజ‌యం ద‌క్కించుకున్నా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు.