నిన్న ఈటీవీ.. నేడు ఈనాడు

తెలుగు మీడియాలో ఉన్నంతలో కొంచెం విలువలతో, వివాదాలకు దూరంగా, పద్ధతిగా సాగేది ఈనాడు-ఈటీవీ గ్రూపే. ఈ మీడియా మీద కూడా విమర్శలు లేకపోలేదు కానీ.. వాళ్ల రాజకీయ ఉద్దేశాలు, విధానాల సంగతి పక్కన పెడితే వార్తల ప్రెజెంటేషన్ విషయంలో మిగతా మీడియాల్లాగా సెన్సేషనలిజం కోసం ప్రయత్నించరు. సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా.. వార్తల్ని ఉన్నదున్నట్లుగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈటీవీ ఎంత సంప్రదాయబద్ధంగా.. నో నాన్సెన్స్ అన్నట్లుగా సాగిపోతుంటుంది.

అలాంటి ఛానెల్ మొన్న లైట్లు ఆర్పి దీపాలు వెలిగించాలన్న మోడీ పిలుపునకు స్పందిస్తూ.. న్యూస్ స్టూడియోలో కూడా లైట్లు ఆర్పి టార్చ్ వెలుగులో వార్తలు చదువుతున్న యాంకర్లను చూపించడంపై ఎంతగా ట్రోలింగ్ జరిగిందో తెలిసిందే. ఒక రోజంతా ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.

ఆ ట్రోలింగ్ మరువకముందే ఇప్పుడు ‘ఈనాడు’ పత్రిక లైన్లోకి వచ్చింది. ఈ రోజు ఉదయం నుంచి ఆ పత్రికను హిందూ మద్దతు దారులు విపరీతంగా తిట్టిపోస్తున్నారు. ‘ఈనాడు’ను హిందూ వ్యతిరేక పత్రికగా ముద్ర వేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇందుక్కారణం.. ఆ పత్రికలో ‘ఆ లక్షణాలేవీ లేకుండానే..’ అనే హెడ్డింగ్‌తో ఓ వార్త వచ్చింది. అందులో.. ‘అమీర్ పేటకు చెందిన రవి (పేరు మార్చాం) మార్చి 13వ తేదీన దిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి 18వ తేదీన నగరానికి వచ్చారు’ అంటూ రాసుకొచ్చారు.

ఐతే మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వాళ్లంటే వాళ్లు ఆటోమేటిగ్గా ముస్లింలు అయ్యుంటారు. అలాంటపుడు ఉదాహరణగా ముస్లిం పేరే పెట్టాల్సింది. పేరు పెట్టడం ఇబ్బంది అనుకుంటే.. ఓ వ్యక్తి అనాల్సింది. అలా కాకుండా ‘రవి’ అంటూ హిందూ పేరు పెట్టడంతో వచ్చింది చిక్కు. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి వార్త రాయడం.. దాన్ని పాస్ చేయడం తప్పిదమే. దీంతో హిందూ మద్దతుదారులు ‘ఈనాడు’ మీద మండిపడుతున్నారు. దాన్ని హిందూ వ్యతిరేక పత్రికగా పేర్కొంటూ తిట్టిపోస్తున్నారు.