శిల్పాశెట్టికి రెండు కోట్ల నష్టం!

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో శిల్పాశెట్టి ఇమేజ్ పై దెబ్బ పడింది. ఆమె కెరీర్ పై రాజ్ కుంద్రా అరెస్ట్ ఎఫెక్ట్ చూపిస్తోంది. శిల్పా తన ఆదాయాన్ని కోట్లలో కోల్పోతుంది. బుల్లితెరపై ఓ డాన్స్ షోకి ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. ఎప్పుడైతే రాజ్ కుంద్రాను అరెస్ట్ చేస్తారో అప్పటినుండి ఆమె టీవీ షోలో కనిపించడం లేదు.

ఒక్కో ఎపిసోడ్ కి శిల్పాశెట్టి రూ.18 నుండి రూ.22 లక్షల వరకు ఛార్జ్ చేస్తుంది. కానీ కొన్నిరోజులుగా ఆమె షూటింగ్ కి రావడం లేదు. దీని వలన ఆమె మొత్తంగా రూ.2 కోట్లు నష్టపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. రీసెంట్ గా ఈ డాన్స్ షోకి జడ్జిగా కరిష్మా కపూర్ ఒక ఎపిసోడ్ లో కనిపించింది. ఆ తరువాత జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ లను తీసుకొచ్చారు. అయితే వీరంతా ఒక్కో ఎపిసోడ్ లో కనిపించి వెళ్లిపోయారు.

ఎక్కువ రోజులు ఇలా గెస్ట్ జడ్జిలతో షోని నడిపించలేరు. దీంతో అసలు షోలో శిల్పాశెట్టిని ఉంచాలా..? లేదా అనే విషయంలో ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. రాజ్ కుంద్రా కేసు ఓ కొలిక్కి వస్తే గానీ శిల్పాశెట్టి బయటకు రాలేదు. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. రీసెంట్ గా శిల్పాశెట్టి తన ట్విట్టర్ లో రాజ్ కుంద్రా అరెస్ట్ పై ఓ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనపై అసత్య ప్రచారాలు చేయొద్దంటూ మీడియాకు రిక్వెస్ట్ చేసింది.