తారక్ నుంచి 25 లక్షలు గెలిచిన చరణ్

నాలుగు సీజన్ల పాటు అలరించి.. అర్ధంతరంగా ఆగిపోయిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పేరుతో పున:ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు ‘స్టార్ మా’ ఛానెల్లో అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి ఈ షోను నడిపించగా.. ఇప్పుడు ‘జెమిని’ టీవీకి మారిన షోను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నారు. మరి కొన్ని రోజుల్లోనే షో మొదలు కాబోతోంది. తాజాగా ఒక ప్రోమో కూడా వదలడం.. అది ప్రేక్షకులను ఆకట్టుకోవడం తెలిసిందే.

ఇక తొలి ఎపిసోడ్లో తారక్ ముందు ‘ఆర్ఆర్ఆర్’ కోస్టార్ రామ్ చరణ్ కూర్చోబోతున్నాడన్న సమాచారం కూడా బయటికి వచ్చింది. తారక్-చరణ్ కలిసి తొలి ఎపిసోడ్లో షోను రక్తి కట్టిస్తారనడంలో సందేహం లేదు. ఈ ఎపిసోడ్ టీఆర్పీ రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఎపిసోడ్ గురించి మరింత ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది.

ఫస్ట్ ఎపిసోడ్లో చరణ్.. తారక్ ప్రశ్నలకు బాగానే సమాధానం చెప్పాడని.. రూ.25 లక్షలు గెలిచాడని సమాచారం. తారక్ చేతుల మీదుగా ఆ చెక్కు అందుకుని మొత్తం డబ్బును ఛారిటీకి ఇచ్చేశాడట మెగా పవర్ స్టార్. ఇక ఈ షోను డైరెక్ట్ చేస్తున్నది దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల అన్న విషయం కూడా బయటికి వచ్చింది. సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం, నేల టిక్కెట్టు చిత్రాలను రూపొందించిన కళ్యాణ్.. మూడేళ్లుగా ఏ సినిమా చేయలేదు. త్వరలోనే ‘బంగార్రాజు’ సినిమా మొదలు పెట్టాల్సి ఉంది.

ఆ సినిమాకు స్క్రిప్టు పూర్తి చేసి ఖాళీగా ఉన్న కళ్యాణ్.. మధ్యలో దొరికిన ఖాళీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోను డైరెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తారక్ కొన్ని ఎపిసోడ్లను ఇప్పటికే పూర్తి చేసేశాడని.. మధ్యలో గ్యాప్ తీసుకుని ‘ఆర్ఆర్ఆర్’ పాట చిత్రీకరణ కోసం యూరప్ వెళ్తున్నాడని.. ఆ తర్వాత మరి కొన్ని ఎపిసోడ్లు చేసి కొరటాల శివ సినిమాను మొదలుపెడతాడని సమాచారం.