ఓ బేబీ తర్వాత ఇంకోటి మొదలైంది

భారతీయ చిత్రాలకు విదేశీ సినిమాలు స్ఫూర్తిగా నిలవడం కొత్తేమీ కాదు. ఒకప్పుడు ఏ హాలీవుడ్ సినిమానో.. కొరియన్ మూవీనో చూసేసి సైలెంటుగా కాపీ కొట్టేసేవాళ్లు. ఫలానా మూవీకి ఇది కాపీ అనే విషయం జనాలకు పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఓటీటీలు, పైరసీ వెబ్ సైట్ల ద్వారా ప్రపంచ సినిమా అందరికీ చేరువైపోయింది.

ఎక్కడ ఏ చిన్న సీన్ కాపీ కొట్టినా కూడా పట్టేసి నెట్లో పెట్టేస్తున్నారు. సినిమాలకు సినిమాలను లేపేస్తే.. దాని మేకర్స్‌కు విషయం తెలిసిపోయి కేసులు వేసే వరకు పరిస్థితి వెళ్తోంది. అందుకే విదేశీ చిత్రాల నుంచి స్ఫూర్తి పొందితే.. అధికారికంగా రీమేక్ రైట్స్ కొని సినిమాలు తీస్తున్నారు.

ఊపిరి, ఓ బేబీ లాంటి చిత్రాలు ఈ కోవలోనివే. ఇందులో ‘ఓ బేబీ’ని కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’ ఆధారంగా తెరకెక్కించింది సురేష్ ప్రొడక్షన్స్. ఇప్పుడు అదే సంస్థ మరో కొరియన్ మూవీని తెలుగులోకి తీసుకొస్తోంది.

‘స్వామి రారా’తో భారీగా అంచనాలు పెంచి, ఆ తర్వాత స్థాయికి తగ్గ సినిమాలు తీయని సుధీర్ వర్మ సురేష్ ప్రొడక్షన్స్ వారి కొత్త రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం కొరియాలో సూపర్ హిట్ అయిన ‘మిడ్ నైట్ రన్నర్స్’ ఆధారంగా తెరకెక్కనుంది. రెజీనా కసాండ్రా, నివేథా థామస్ ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్నారు.

థ్రిల్లర్స్ తీయడంలో సుధీర్‌కు మంచి పట్టుంది. ఐతే సొంతంగా సరైన కథలు తయారు చేసుకోవడంలో తడబడుతుంటాడు. ఈసారి మంచి కంటెంట్ ఉన్న థ్రిల్లర్ మూవీ కావడంతో దాన్ని తనదైన శైలిలో రీమేక్ చేసి హిట్టు కొడతాడని ఆశించవచ్చు. హైదరాబాద్‌లో సోమవారమే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది.

పరిమిత బడ్జెట్లో, తక్కువ రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేయడానికి చూస్తున్నారు. కొంచెం గ్యాప్ తర్వాత రెజీనాకు తెలుగులో దక్కిన ఫుల్ లెంగ్త్ మూవీ ఇది. ఈ ఏడాది చివరికే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని టార్గెట్‌గా పెట్టునకున్నారట.