ఎన్టీఆర్ సినిమాకు 200 కోట్లు?

NTR

రాజమౌళితో ‘బాహుబలి’ చేశాక ప్రభాస్ ఫాలోయింగ్, మార్కెట్ ఎంతలా పెరిగిపోయిందో తెలిసిందే. ఇప్పుడు రాజమౌళి కొత్త చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో లీడ్ రోల్స్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మార్కెట్ కూడా అమాంతం పెరుగుతుందనే అంచనాలే ఉన్నాయి.

‘బాహుబలి’కి దీటుగా ఈ చిత్రం వసూళ్ల మోత మోగించడం ఖాయంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా తారక్, చరణ్ మంచి పాపులారిటీ సంపాదించాక వాళ్లు భవిష్యత్తులో చేయబోయే సినిమాల రేంజే వేరుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పారితోషకాలు పెరుగుతాయి. కథల స్థాయి పెరుగుతుంది. కాస్ట్ అండ్ క్రూ రేంజ్ ఎక్కువుంటుంది. బహు భాషల్లో రిలీజ్ ఉంటుంది.

అలాంటపుడు సినిమాల బడ్జెట్ పెరగకుండా ఎలా ఉంటుంది? ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేసిన ‘సాహో’ను ముందు రూ.50 కోట్లలో తీయాలనుకున్నారు. కానీ చివరికి దాని బడ్జెట్ రూ.300 కోట్లను దాటింది. తారక్, చరణ్‌‌ల సినిమాల రేంజ్ ఈ స్థాయిలో కాకున్నా పెరగడం మాత్రం పక్కా.

ఆల్రెడీ శంకర్ దర్శకత్వంలో చరణ్ చేయబోతున్న కొత్త చిత్రం బడ్జెట్ రూ.200 కోట్ల పైమాటే అంటున్నారు. ఇప్పుడు తారక్ కూడా అదే క్లబ్బులో అడుగు పెట్టనున్నట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రూ.180-200 కోట్ల దాకా బడ్జెట్ ఎస్టిమేషన్స్ వేశారట.

ఇందులో పారితోషకాలకే రూ.100 కోట్ల దాకా పోవడం ఖాయం. కొరటాల మామూలుగానే తన సినిమాలు చాలా రిచ్‌గా ఉండేలా చూసుకుంటాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ మీద అంచనాలు పెరుగుతాయి కాబట్టి మరింత రిచ్‌గా ఈ సినిమా తీయాలనుకుంటున్నాడట.

ఆయన మిత్రుడైన సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నాడు. అతను తొలి చిత్రాన్ని రాజీ లేకుండా నిర్మించాలనుకుంటున్నాడు. రూ.250-300 కోట్ల మధ్య బిజినెస్ చేసుకునే ఛాన్సుండటంతో రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టడానికి ఎందుకు వెనుకాడతారు మరి.