ప‌వ‌న్ వ్యూహాత్మ‌క రాజ‌కీయం.. స‌క్సెస్ అయ్యేనా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారా ? రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలా వ్య‌వ‌హ‌రిస్తే బాగుంటుంద‌నే విష‌యంలో ఆయ‌న స్ప‌ష్ట‌మైన క్లారిటీతో ఉన్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జ‌ల వివాదాలు స‌హా అనేక విభ‌జ‌న స‌మ‌స్య‌ల విష‌యంపై అంత‌ర్గ‌త చ‌ర్చ సాగుతోంది.

ఈ విష‌యంలో ఎవ‌రు జోక్యం చేసుకున్నా.. తెలంగాణ‌తో బంధాలు తెంపుకోవాల్సి ఉంటుంది. బ‌హుశ అందుకే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కూడా సైలెంట్‌గా ఉంటోంది. ఏదైనా ఉంటే.. ఏపీ సీఎం జ‌గ‌న్‌ పైనే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు టీడీపీ నాయ‌కులు.

ఇప్పుడు ఇది కూడా స‌రైంది కాద‌ని.. ప‌వ‌న్ భావిస్తున్న‌ట్టు ప‌రిశీల‌కులు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల జ‌ల వివాదాల‌ను ప‌రిశీలిస్తే.. ఇరు వైపు ప్ర‌భుత్వాల‌దీ త‌ప్పు ఉంది. అలాగ‌ని.. తెలంగాణ స‌ర్కారును విమ‌ర్శిస్తే.. అక్క‌డ ఉన్న ప‌రిస్థితులు త‌న‌కు వ్య‌తిరేకంగా మారే అవ‌కాశం ఉంద‌ని.. అలాగ‌ని.. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డితే.. ఇది మ‌రింత ప్ర‌భావం చూపుతుంద‌ని.. ప‌వ‌న్ ఇటీవ‌ల జ‌రిగిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో అంత‌ర్గ‌తంగా ఒక అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఈ విష‌యంపై ఎవ‌రూ స్పందించ‌వ‌ద్ద‌ని.. రెండు రాష్ట్రాలూ.. ఒక నిర్ణ‌యం తీసుకుని.. ఒక విధ‌మైన క‌ట్టుబాటుకు వ‌చ్చాక స్పందిద్దామ‌ని ఆయ‌న భావిస్తున్నారు. అయితే.. ఇది వ్యూహ‌మే అయిన‌ప్ప‌టికీ.. రాజకీయంగా క‌లిసి వ‌స్తుందా ? అనేది కీల‌కంగా మారింది. ఎందుకంటే.. ఏ రాజ‌కీయ నేత అయినా.. పార్టీ అయినా.. స‌మ‌స్య తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు స్పందించాలి. లేదా.. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే మార్గం కోసం చ‌ర్య‌లు చేప‌ట్టాలి.

గ‌తంలో హోదా స‌హా వెనుక బ‌డిన జిల్లాల అభివృద్ధివిష‌యం తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు.. నేరుగా ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో విజ‌య‌వాడ‌లో చ‌ర్చించిన ప‌వ‌న్‌.. ఇప్పుడు జ‌ల వివాదం విష‌యానికి వ‌స్తే.. అస‌లు మౌనంగా ఉన్నారు. దీనిని బ‌ట్టి ఆయ‌న రెండు తెలుగు రాష్ట్రాల విష‌యంపై ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. కానీ, ఇది ఇప్పుడున్న ప‌రిస్థితి స‌క్సెస్ కావ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.