ఔను నిజమే అన్న నాగార్జున

హిందీలో పేరున్న హీరోలు, హీరోయిన్లు వెబ్ సిరీస్‌లు జోరుగా చేస్తున్నారు. ఓటీటీలను లక్ష్యంగా చేసుకుని తెరకెక్కుతున్న సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ స్టార్లు కొంచెం వెనుకబడే ఉన్నారు. వెబ్ సిరీస్‌లు, వెబ్ ఫిలింల పట్ల ఇప్పుడిప్పుడే మన వాళ్ల ఆలోచన మారుతోంది. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున లాంటి సీనియర్ హీరో డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.

ఐతే దీనిపై అధికారిక ప్రకటనే రాలేదు ఇంకా. ఐతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ్ తన డిజిటల్ డెబ్యూ గురించి స్పందించాడు. ఆ దిశగా అడుగులు వేస్తున్న సంగతి నిజమే అని ఆయన ధ్రువీకరించడం విశేషం. ఓటీటీ కోసం సినిమా చేయడం గురించి అడిగితే.. తాము ఒక ఐడియా అనుకున్నామని.. అది తనకు బాగా నచ్చిందని.. ప్రస్తుతం దాన్ని డెవలప్ చేస్తున్నామని నాగ్ వెల్లడించాడు.

అందరూ అనుకుంటున్నట్లు అది ఓటీటీ సినిమానే అని కూడా నాగ్ చెప్పడం గమనార్హం. ఈ వేదిక తనకు చాలా కొత్త అని.. అందుకే కాస్త ప్రయోగాలు చేయాలనుకుంటున్నామని.. సినిమాల్లో ఇప్పటి వరకు చేయనివి ఓటీటీల్లో చేయాలన్నది తన ఆలోచన అని నాగ్ తెలిపాడు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు గురించి ఇంతకుమించి ఏమీ స్పందించలేనని.. దానికింకా టైం ఉందని నాగ్ అన్నాడు. నాగ్ చివరి సినిమా ‘వైల్డ్ డాగ్’ను నేరుగా నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయడానికి రెడీ అవడం.. కానీ మళ్లీ మనసు మార్చుకుని థియేటర్లలో విడుదల చేయడం తెలిసిందే.

ఐతే థియేటర్లలో ఈ సినిమాకు ఆశించిన స్పందన రాలేదు. తర్వాత నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ చేస్తే జనం బాగానే చూశారు. కంటెంట్‌ను బట్టి కొన్ని చిత్రాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడం మంచిదే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే నాగ్ ఓటీటీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వెబ్ ఫిలిం చేయడానికి రెడీ అయినట్లున్నాడు.