జమ్మూలో ఎన్ కౌంటర్.. తెలుగు జవాన్ వీరమరణం..!

జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ముష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. వీరిలో ఒకరు తెలుగు జవాను కూడా ఉండటం గమనార్హం.

రాజౌరీ జిల్లాలోని సుందర్‌ బాని సెక్టార్ లో ఈ ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో వీర మరణం పొందిన జవాన్లలో ఒకరు గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన జశ్వంత్‌ రెడ్డి. ఆర్మీ అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో జశ్వంత్ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

2016లో మద్రాసు రెజిమెంట్‌ ద్వారా సైన్యంలో చేరారు జశ్వంత్. తొలుత నీలగిరిలో పనిచేయగా.. తర్వాత జమ్మూకాశ్మీర్ కు వెళ్లారు. నాలుగు నెలల క్రితమే సెలవులపై ఇంటికొచ్చిన జశ్వంత్ రెడ్డికి పెళ్లి చేయాలని భావించారు. మరో నెల రోజుల్లో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంతలోనే మరణవార్త విని శోకసంద్రంలో మునిగిపోయారు. ఇవాళ రాత్రికి జశ్వంత్ మృతదేహం బాపట్లకు చేరుకునే అవకాశం ఉంది.