మహేష్-త్రివిక్రమ్.. అప్పుడే మూడు పాటలు


ఈ మధ్యే టాలీవుడ్లో ఎవ్వరూ ఊహించని ఒక కాంబినేషన్ తెరపైకి వచ్చింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి మరో సినిమా చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే వీరి కలయికలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చిన సంగతి తెలిసింది ఈ కలయికలో మూడో సినిమా గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది కానీ.. అది ఇప్పుడిప్పుడే సాధ్యపడేలా కనిపించలేదు.

కానీ ‘వైకుంఠపురములో’ తర్వాత ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా అనివార్య కారణాలతో రద్దు కాగా.. దాని బదులు మహేష్‌తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ మాతృ సంస్థ అనదగ్గ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఐతే ప్రస్తుతం మహేష్ బాబు.. ‘సర్కారు వారి పాట’ పనిలో బిజీగా ఉండగా త్రివిక్రమ్ సినిమాను మొదలు పెట్టడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ప్రస్తుతం సినిమా ప్రి ప్రొడక్షన్ దశలో ఉంది.

ఐతే మామూలుగా సినిమా షూటింగ్ మొదలై కొంత ముందుకు నడిచాక సంగీత దర్శకుడు పని మొదలుపెడుతుంటాడు. సినిమా మధ్య దశలో ఉండగా పాటలు రెడీ అవుతుంటాయి. కానీ ఈ సినిమా పట్ల ఎంతో ఉత్సాహంతో ఉన్న తమన్.. ఇంకా షూటింగ్ మొదలు కాకముందే పాటలు సిద్ధం చేసేస్తుండటం విశేషం. తాజాగా క్లబ్ హౌస్‌ చర్చా కార్యక్రమంలో తమన్.. మహేష్-త్రివిక్రమ్ సినిమా గురించి క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు.

ఈ సినిమాలో సంగీతానికి మంచి ప్రాధాన్యం ఉందని.. చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని.. ఇప్పటికే అందులో మూడు పాటల రికార్డింగ్ కూడా పూర్తయిందని అతను వెల్లడించడం విశేషం. దాదాపుగా అన్ని ట్యూన్లూ ఓకే అయిపోయాయని.. సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ముందే పాటల పని పూర్తయిపోతుందని అతను చెప్పాడు. కొన్నేళ్లుగా మంచి ఊపులో ఉన్న తమన్.. ఇప్పుడు కెరీర్ పీక్స్‌లో ఉన్నాడు. ఈ ఊపులో తెలుగు తమిళ భాషల్లో భారీ ప్రాజెక్టులకు పని చేస్తున్నాడు.