కేజీఎఫ్ దర్శకుడిపై కన్నడిగుల ఫైర్

‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల జనాల్ని, ప్రేక్షకులను ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు కూడా అతడి పట్ల ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిచారు. ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలు అతడితో పని చేయడానికి ముందుకొచ్చినట్లు వార్తలొచ్చాయి. వీరిలో తారక్ నిజంగానే ప్రశాంత్‌తో సినిమాను ఓకే చేసుకున్నాడు. ఈ చిత్రం కోసం ప్రశాంత్‌కు మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను తారక్‌తో పని చేయబోతున్న విషయాన్ని నిన్న అతడి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో పరోక్షంగా వెల్లడించాడు ప్రశాంత్. ఐతే నిన్న తారక్ గురించి ప్రశాంత్ ట్వీట్ వేశాడో లేదో.. కన్నడ సినీ అభిమానుల్లో వేడి మొదలైంది. అదే పనిగా ప్రశాంత్‌ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలతో ట్వీట్లు వేస్తున్నారు.

ప్రశాంత్‌కు దర్శకుడిగా అవకాశమిచ్చింది, గుర్తింపు తెచ్చింది కన్నడ సినీ పరిశ్రమ అని.. ఐతే ‘కేజీఎఫ్’తో పేరు రాగానే అతడి దృష్టి టాలీవుడ్ హీరోల మీద పడిందని.. భారీ పారితోషకానికి ఆశపడి ఎన్టీఆర్‌తో సినిమాకు రెడీ అయిపోయాడని వాళ్లు విమర్శిస్తున్నారు. ఇక్కడ ఎంతోమంది స్టార్లు ఉండగా.. వెంటనే తెలుగులో సినిమా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్నారు. అతను కన్నడ సినిమాను వాడుకుని వెళ్లిపోతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇంతకుముందు రష్మిక మందన్నా కూడా ఇదే పని చేసిందని.. కన్నడ సినిమాలో ఫేమ్ రాగానే టాలీవుడ్ వైపు చూసిందని.. అక్కడ కొంచెం పేరు రాగానే పారితోషకాలకు ఆశపడి అక్కడే సెటిలైపోయిందని గుర్తు చేస్తున్నారు. ఆమెతో ప్రశాంత్‌ను పోలుస్తూ ఏకిపడేస్తున్నారు. ‘గెటౌట్ ప్రశాంత్ నీల్’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి అతడిని తిట్టిపోస్తున్నారు. ఐతే దీనికి కౌంటర్‌గా తెలుగు అభిమానులు ‘వెల్కం టు టీఎఫ్ఐ ప్రశాంత్ నీల్’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు గుప్పిస్తుండటం విశేషం.