‘తెలంగాణ ఏం చేయాలో ఆంధ్ర నిర్ణయిస్తుందా? ‘

ఏదైనా అంశం మీద వివాదం నడుస్తున్నప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడి సమస్యను మరింత పెంచే కన్నా.. దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రులు మర్చిపోతున్నారా? అన్నది ప్రశ్నగా మారింది.

తెలంగాణ మంత్రులు ఆరోపించినట్లే.. ఏపీ నిజంగానే నీటి చౌర్యానికి పాల్పడుతుంటే.. ఆ విషయాన్ని ఆధారాలతో సహా చూపించి.. ఇదెక్కడి దొంగ బుద్ధి అంటూ నిలదీయాలి. ఇది కూడా కాదంటే.. కేంద్రానికి కంప్లైంట్ చేసి తమ వాదనలో వాస్తవం ఏమిటో నిరూపించాలి. అంతేకానీ.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం.. వివాదాన్ని మరింత పెంచేలా వ్యాఖ్యలు చేయటం ఏ మాత్రం మంచిది కాదు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తున్న వేళ.. మంట పుట్టే మాటల్ని మాట్లాడటం సరికాదు. సంబంధం లేని లాజిక్కుల్ని తెర మీదకు తీసుకురావటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అదే సమయంలో.. ఎవరైతే లాజిక్కు చెప్పారో.. అదే లాజిక్కు మీకు కూడా వర్తిస్తుంది కదా? అన్న ప్రశ్నకు సమాధానం సిద్ధంగా ఉండాలి. తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ చేసిన వ్యాఖ్యల్నే చూడండి. ఆయన లాజిక్కులో లోపించిన పస ఇట్టే కనిపిస్తుంది.

శ్రీశైలంలో తెలంగాణ చేపట్టిన జల విద్యుత్ ఉత్పత్తిని ఆపేందుకు ప్రయత్నిస్తామని ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శ్రీశైలంలోజల విద్యుత్ ఉత్పత్తి ఆపటం ఎవరి తరం కాదన్నారు. నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామన్నారు. తెలంగాణ ఏం చేయాలో ఆంధ్ర నిర్ణయిస్తుందా? అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా.. అహంకార ధోరణితో వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

జగదీశ్ మాటల్నే ప్రాతిపదికగా తీసుకొని ఆయన కోణంలోనే మాట్లాడితే.. ఏపీ నిర్మించే ప్రాజెక్టులు అక్రమమని.. వాటిని ఆపి తీరుతామని కేసీఆర్ అండ్ కో ఇప్పటికే పేర్కొన్నారు. అంటే.. ఏపీ ఏం చేయాలో తెలంగాణ నిర్ణయిస్తుందా? ఇలాంటి మాటలు తెలంగాణ ప్రభుతు్వం ఏకపక్షంగా.. అహంకార ధోరణిలో మాట్లాడుతుందన్న మాటను ఏపీ నేతలు సంధిస్తే.. మంత్రి జగదీశ్ ఏమని బదులిస్తారు? వివాద వేళ.. వాతావరణాన్ని మరింత వేడెక్కించే కన్నా.. చర్చలతో పరిష్కరించుకోవటం ఉత్తమం అన్న విషయాన్ని మర్చిపోకూడదు.