ఏపీలోనూ మార్పు త‌ప్ప‌దా.. కాంగ్రెస్‌లో గుబులు..!


ఏపీ కాంగ్రెస్‌లోనూ మార్పు త‌ప్ప‌దా ? పీసీసీ చీఫ్‌ను మార్చ‌డం ఖాయ‌మేనా ? ఇదీ.. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌. ఇటీవ‌ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ను మార్చిన నేప‌థ్యంలో అక్క‌డ పార్టీలో భారీ మార్పుల దిశ‌గా పార్టీ అధిష్టానం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ క్ర‌మంలో ఏపీలోనూ మార్పు ఖాయ‌మ‌నే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఏపీకి సార‌థ్యం వ‌హిస్తున్న సాకే శైల‌జానాథ్ ప‌నితీరు బాగోలేద‌ని, ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోతున్నార‌ని.. ఏపీకి చెందిన సీనియ‌ర్లు.. ప‌ల్లంరాజు స‌హా ప‌లువురు కొన్నాళ్లుగా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ మాట‌కు వ‌స్తే ర‌ఘువీరా పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడే కాస్తో కూస్తో హ‌డావిడి ఉండేది.. ఇప్పుడు అది కూడా లేదు.

నిజానికి సాకే ప‌నితీరుపై స్థానిక నేత‌ల్లోనూ విశ్వాసం స‌న్న‌గిల్లింది. అమ‌రావ‌తి ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసిన స‌మ‌యంలో.. ఆ ఉద్య‌మాన్ని అడ్డుపెట్టుకుని క‌మ్యూనిస్టులు సైతం పుంజుకున్న దాఖ‌లా క‌నిపిస్తే.. కాంగ్రెస్‌లో మాత్రం ఆ త‌ర‌హా రాజ‌కీయం. వ్యూహం కొర‌వ‌డింది. అన్ని విభాగాల్లో ఏపీలో రోజు రోజుకు దిగ‌జారుతోంది. ఇక్క‌డ ఫైట్ చేసేందుకు పోల‌వ‌రం, అమ‌రావతి, ప్ర‌త్యేక హోదా ఇలా చాలా అంశాలే ఉన్నాయి. వీటిల్లో ఏ ఒక్క‌దానిపై స్టాండ్ తీసుకుని పోరాటం చేసినా కాంగ్రెస్‌కు ఎంతో కొంత మైలేజ్ ఉంటుంది. కానీ ఆ ఆలోచ‌న‌లే ఇక్క‌డ పార్టీ నేత‌ల‌కు లేవు.

ప్ర‌త్యేక హోదా విష‌యం ఇప్ప‌టికీ హాట్ టాపిక్‌గానే ఉంది. ఈ క్ర‌మంలో మేం అధికారంలోకి వ‌స్తే.. హోదా ఇచ్చేలా ఒత్తిడి తెస్తాం.. అనే మాట‌ను సాకే నోటి నుంచి ఇప్ప‌టి వ‌రకు వినబ‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదే స‌మ‌యంలో పోల‌వ‌రం ప్రాజెక్టులో అవినీతి జ‌రుగుతోంద‌నే ఆరోప‌ణ‌లు ఉన్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆదిశ‌గా కూడా కాంగ్రెస్ నాయ‌కుడు చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. మ‌రీ ముఖ్యంగా పార్టీని క్షేత్ర‌స్థాయి నుంచి డెవ‌ల‌ప్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. గ‌తంలోనే తీర్మానం చేసిన‌.. కాంగ్రెస్ పెద్ద‌లు.. ఈ క్ర‌మంలోనే ఘ‌ర్ వాప‌సీ నినాదం తెర‌మీదికి తెచ్చారు. మ‌రి ఇది ఏమైందో వారికే తెలియాలి.

ఇప్పుడున్న ప‌రిస్థితిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునేందుకు, ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు అనేక అవ‌కాశాలు, మార్గాలు ఉన్నా.. సాకే స‌రైన వ్యూహంతో పార్టీని న‌డిపించ‌లేక పోతున్నార‌నేది సీనియ‌ర్ల ఆవేద‌న‌. అంతో ఇంతో గ‌ళం వినిపిస్తున్న‌వారిని.. ప్ర‌భుత్వంపై విమర్శ‌లు చేస్తున్న వారిని కూడా. . గుర్తించ‌క‌పోవ‌డం మ‌రో పెద్ద లోపంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే సాకే మార్పు దిశ‌గా కొన్ని రోజులుగా చ‌ర్య‌లు ప్రారంభ‌మ‌య్యాయ‌ని ఢిల్లీ నుంచి స‌మాచారం ఉంది. తాజాగా జ‌రుగుతున్న హైలెవ‌ల్ మీటింగ్‌లో దీనిపై ఒక క్లారిటీ వస్తుంద‌ని భావిస్తున్నారు.