నయా చోకర్స్ టీమ్ ఇండియా

క్రికెట్లో చోకర్స్ అనగానే అందరికీ దక్షిణాఫ్రికా జట్టే గుర్తుకొస్తుంది. ఆ జట్టు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో చాలా బాగా ఆడుతుంది కానీ.. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలకు వచ్చేసరికి తుస్సుమనిపిస్తుంటుంది. ముఖ్యంగా లీగ్ దశలో బాగా ఆడే ఆ జట్టు కీలకమైన నాకౌట్ దశకు వచ్చేసరికి చేతులెత్తేస్తుంటుంది. విజయానికి చేరువగా వచ్చి ఓడిపోవడం, ఆ జట్టును దురదృష్టం వెంటాడటం చాలా కామన్. ఐతే గత కొన్నేళ్లలో దక్షిణాఫ్రికా ప్రదర్శన పడిపోయి ఆ జట్టు మీద అసలు అంచనాలే ఉండట్లేదు.

ఐతే వివిధ ఫార్మాట్లలో ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా ఎదిగిన టీమ్ ఇండియా ఇప్పుడు ‘చోకర్స్’ ట్యాగ్ కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. అప్పటిదాకా బాగా ఆడి.. నాకౌట్ దశకు వచ్చేసరికి తుస్సుమనిపించడం భారత్‌కు ఇప్పుడు బాగా అలవాటవుతోంది. 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాక టీమ్ ఇండియా ప్రదర్శన చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

2014లో టీ20 ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శన చేస్తూ ఫైనల్ చేరింది భారత్. టైటిల్‌ మనదే అని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశాక ఫైనల్లో భారత్ చేతులెత్తేసింది. శ్రీలంక చేతిలో పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తర్వాత రెండేళ్లకు సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ లీగ్ దశలో అదరగొట్టి సెమీస్ చేరింది భారత్. ఆ మ్యాచ్‌లో భారీ స్కోరు చేసి విజయంపై ధీమాగా ఉండగా.. వెస్టిండీస్ భారీ లక్ష్యాన్ని ఛేదించి భారత్‌కు షాకిస్తూ ఫైనల్ చేరింది. ఇక 2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ భారీ విజయాలతో ఫైనల్ చేరింది. అప్పటికే లీగ్ దశలో పాకిస్థాన్‌ను చిత్తు చేయడంతో కప్పు మనదే అని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. కానీ పాక్ భారత్‌కు షాకిచ్చి కప్పు ఎగరేసుకుపోయింది.

ఇక రెండేళ్ల కిందట వన్డే ప్రపంచకప్‌లో ఏమైందో అందరికీ తెలిసిందే. తిరుగులేని విజయాలతో సెమీస్ చేరితే.. అక్కడ న్యూజిలాండ్ చేతిలో షాక్ తప్పలేదు. ఇప్పుడిక అదే జట్టు చేతిలో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఎదురు దెబ్బ తగిలింది. వర్షం వల్ల ఆరో రోజుకు (రిజర్వ్ డే)కు మళ్లిన ఈ మ్యాచ్ డ్రా అవుతుందని.. భారత్, న్యూజిలాండ్ జట్లు రెండూ సంయుక్త విజేతలుగా నిలుస్తాయని అంచనా వేస్తే.. చివరి రోజు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. ఇలా వరుసగా ఐసీసీ టోర్నీల్లో చివరి మెట్టుపై బోల్తా కొడుతూ ‘నయా చోకర్స్’ అనిపించుకుంటోంది టీమ్ ఇండియా.