ఆ ఏపీ మంత్రి స్ట‌యిలే డిఫ‌రెంట్‌.. !


ఏపీ సీఎం జ‌గ‌న్ కేబినెట్‌లో ఎవ‌రు బెస్ట్ ? ఈ ప్ర‌శ్న‌కు నీళ్లు న‌మ‌లాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కి ధీటైన‌, త‌గిన మంత్రి ఎవ‌రు అంటే మాత్రం త‌డుముకోకుండా స‌మాధానం ల‌భిస్తోంది. ప్ర‌తిప‌క్షాలు కానీ, ఇత‌ర నేత‌లు కానీ.. ప్ర‌త్య‌ర్థులుకానీ.. ఎలాంటి విమ‌ర్శ‌లు చేసినా.. కోర్టులు హెచ్చ‌రిక‌లు జారీ చేసినా.. ఎలాంటి బాధ‌, భ‌యం లేకుండా ముందుకు సాగుతున్న మంత్రుల్లో ఒకే ఒక్కరు ఇటీవ‌ల కాలంలో క‌నిపిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్ మాదిరిగా గ‌ట్స్ ఉన్న మంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారు మంత్రి ఆదిమూల‌పు సురేష్‌. రాష్ట్రంలో క‌రోనా నేప‌థ్యంలో విద్యాసంస్థ‌లు మూత‌బ‌డ్డాయి. అదేస‌మ‌యంలో ఆన్‌లైన్ క్లాసులు కూడా నిర్వ‌హించ‌డం లేదు. దీనికి అనేక కార‌ణాలు ఉన్నాయి.

ఫ‌లితంగా విద్యార్తులు ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అయిన‌ప్ప‌టికీ.. ప‌దో త‌ర‌గ‌తి ఇంట‌ర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి తీరుతామ‌ని.. మంత్రి సురేష్ ప్ర‌క‌టించారు. దీనిపై అనేక వివాదాలు వ‌చ్చాయి. ఏకంగా టీడీపీ వ‌ర్చువ‌ల్‌గా విద్యార్తుల నుంచి అభిప్రాయాలు సేక‌రించింది. ఈ క్ర‌మంలో మెజారిటీ విద్యార్థులు.. మాకు ప‌రీక్ష‌లు వ‌ద్దు.. అంటూ.. ముక్త‌కంఠంతో చెప్పారు. ఇదే విష‌యంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా రెండు లేఖ‌లు సంధించారు. ఇక‌, క‌మ్యూనిస్టు పార్టీలు.. కాంగ్రెస్ నేత‌లు.. కూడా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేస్తూ.. సీఎంకు లెట‌ర్లు రాశారు. అయినా నిర్ణ‌యం మార‌లేదు. ఇక‌, ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. సీఎం జ‌గ‌న్ తాడేప‌ల్లి నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. కానీ, మంత్రి సురేష్ మాత్రం ప్ర‌జ‌ల మ‌ధ్య తిరుగుతున్నారు. వారితో మాట్లాడుతున్నారు.

ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తున్న విష‌యం స్ప‌ష్టంగా మంత్రికి తెలుసు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న కూడా త‌న నిర్ణ‌యంలో మార్పు లేద‌ని ప్ర‌క‌టిస్తూనే ఉన్నారు. తాజాగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టినా.. భ‌యం మాత్రం ప్ర‌జ‌ల‌ను వీడ‌డం లేదు. మ‌రోవైపు చిన్నారుల‌కు థ‌ర్డ్ వేవ్ పొంచి ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. సురేష్ వెన‌క్కి తగ్గ‌కుండా.. తాజాగా ఎంసెట్ నోటిఫికేష‌న్ ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి సంచ‌ల‌నం రేపారు. దీంతో సీఎం జ‌గ‌న్‌కు త‌గిన మంత్రి..అంటూ.. కామెంట్లు వ‌స్తున్నాయి. నిజానికి కేబినెట్‌లో చాలామంది ఫైర్ బ్రాండ్ నేత‌లు ఉన్నా.. ఈ పేరు మాత్రం ఎవ‌రికీ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.