కేసీఆర్ కి మరో షాక్.. కషాయం గూటికి టీఆర్ఎస్ ఎంపీ?

ఈటల ఎపిసోడ్ తర్వత టీఆర్ఎస్ కి వరస షాక్ లు ఇవ్వడానికి ఆ పార్టీ నేతలు రెడీగా ఉన్నారా అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్ తోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మ‌న్ తుల ఉమ, టీఆర్ఎస్ కార్మిక విభాగం నేత అశ్వ‌ద్ధామ‌రెడ్డిలు బీజేపీ గూటికి చేర‌గా, ఇప్పుడు టీఆర్ఎస్ లోక్ స‌భ ఎంపీ కూడా చేరిక‌కు రంగం సిద్ధ‌మ‌యిన‌ట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్.. పార్టీ పై, కేసీఆర్ పై గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాను పార్టీ కోసం ఎంత కష్టపడినా.. తనను కేసీఆర్ పట్టించుకోవడం లేదనిన ఆయన చాలా రోజుల నుంచి బాధపడుతున్నారట. స్థానికంగా కూడా తన వర్గం నేతలకు కాకుండా.. ఇతరులకు పదువులు అప్పగిస్తారని.. ఈ విషయంలో ఆయన చాలా రోజులగా అసంతృప్తి ఉన్నట్లు సమాచారం.

గ‌తంలో కాంగ్రెస్ నుండి త‌న‌పై పోటీ చేసిన టీఆర్ఎస్ మంత్రి అల్లుడికే స్థానికంగా ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని, త‌న‌ను పొమ్మ‌న‌కుండా పొగ‌బెడుతున్న‌ట్లు ఎంపీ ర‌గిలిపోతున్న‌ట్లు పార్టీ శ్రేణుల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

పార్టీకి న‌ష్టం చేసే వారు ఎవ్వ‌రైనా విడిచిపెట్ట‌న‌ని కేసీఆర్ పైకి చెప్పినా… త‌న విష‌యంలో ప‌ట్టించుకోవ‌టం లేద‌ని పాటిల్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈటల రాజేందర్ పార్టీ మారడటం.. ఆయనతోపాటు పలవురు కీలక నేతలు కూడా పార్టీ వీడటంతో… బీబీ పాటిల్ కూడా ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. కొందరు బీజేపీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో ఈ ఎంపీ కూడా తన రాజీనామా తేదీని ప్రకటించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని ప్రచారం జరుగుతోంది.