గ‌వ‌ర్న‌ర్‌కు టీడీపీ ర‌హ‌స్య లేఖ‌.. రంగంలోకి జ‌గ‌న్‌.. ?


ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. అధికార పార్టీ వైసీపీ త‌ర‌ఫున శాస‌న మండ‌లిలో అడుగు పెడ‌తార‌ని అనుకున్న న‌లుగురు నేత‌ల్లో ఇద్ద‌రికి గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ నుంచి తిర‌స్కారం ఎదుర‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దీంతో అస‌లు ఏం జ‌రుగుతుంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. నామినేటెడ్‌ కోటాలో గవర్నర్‌ శాసనమండలిలో నియమించే ఎమ్మెల్సీ స్థానాలు 4 ఖాళీ అయ్యాయి. వీటి భర్తీకి జగన్‌ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం 4పేర్లు.. లేళ్ల అప్పిరెడ్డి(గుంటూరు జిల్లా), తోట త్రిమూర్తులు(తూర్పుగోదావరి), మోషేన్‌ రాజు(పశ్చిమగోదావరి), రమేశ్‌ యాదవ్‌(అనంతపురం జిల్లా)తో కూడిన జాబితాను గవర్నర్‌కు పంపింది.

సాధారణంగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఫైళ్లను గ‌వ‌ర్న‌ర్‌ అదే రోజు ఆమోదించి పంపిస్తారు. చాలా ఫైళ్లు గంటల వ్యవధిలోనే ఆమోదంతో ప్రభుత్వానికి తిరిగి వెళ్లిపోతాయి. కానీ ఎమ్మెల్సీల నియామకం ఫైలు వెళ్లి 4 రోజులైనా ఇంత వరకూ ఆమోదం పొందలేదు. ఇందులో లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులుపై క్రిమినల్‌ కేసులు న్నట్లు గవర్నర్‌కు ఫిర్యాదులు అందాయి. త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదై ఉంది. అప్పిరెడ్డిపై పలు క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. త్రిమూర్తుల‌పై కేసు.. ఏళ్ల‌నాటిది కావ‌డం విశేషం. ఇక‌, అప్పిరెడ్డిపై కేసులు చంద్ర‌బాబు హ‌యాంలో పెట్టిన‌వే.

దీంతో వీరిద్ద‌రికీ మండ‌లి ప‌ద‌వులు ఇస్తున్నార‌నే వార్త‌లు రావ‌డంతో టీడీపీ నేత‌లు.. దీనికి అడ్డుక‌ట్ట వేయాల‌ని భావించి.. గ‌వ‌ర్న‌ర్‌కు ర‌హ‌స్య లేఖ పంపిన‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌న‌డుస్తోంది. ముఖ్యంగా ఎవ‌రికి ప‌ద‌విఇచ్చినా.. ఇవ్వ‌క‌పోయినా.. తోట త్రిమూర్తులుకు అడ్డుప‌డాల‌ని పార్టీ నేత‌లు భావించార‌ని.. ఈ క్ర‌మంలోనే ఆధారాల‌తో స‌హా త్రిమూర్తుల‌పై లేఖ రాశార‌ని స‌మాచారం. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న గ‌వ‌ర్న‌ర్‌.. డీజీపీ నుంచి కూడా.. స‌మాచారం తెప్పించుకున్నార‌ని ఈ క్ర‌మంలోనే ఈ ఇద్ద‌రికీ త‌న కోటాలో మండ‌లి ప‌ద‌వులు ఇచ్చేందుకు ఆయ‌న విముఖ‌త చూపుతున్నార‌ని టీడీపీ వ‌ర్గాలు ప్ర‌చారం లేవ‌దీశాయి. అయితే ఎప్పుడూ కూడా ఈ విష‌యంలో ముఖ్య‌మంత్రి పేర్ల‌కే గ‌వ‌ర్న‌ర్ ఆమోద‌ముద్ర వేయ‌డం ఆన‌వాయితీ..!

ఇక‌, ఈ విష‌యం తెలియ‌గానే సీఎం జ‌గ‌న్ రంగంలోకి దిగిపోతున్నారు. ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం హాట్ టాపిక్‌గా మార‌డంతో ఇదే విష‌యంపై క్లారిటీ ఇచ్చేందుకు, గ‌వ‌ర్న‌ర్‌ను ఒప్పించేందుకు ముఖ్యమంత్రి గ‌వ‌ర్న‌ర్ చెంత‌కు వెళ్తున్నార‌ని తెలుస్తోంది. ఒక‌వేళ సీఎం చెప్పినా.. గ‌వ‌ర్న‌ర్ క‌నుక త‌న కోటాలో లేళ్ల‌, తోట‌కు మండ‌లి ప‌ద‌వులు ఇచ్చేందుకు విముఖ‌త చూపితే.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న శాస‌నస‌భ్యుల ఎమ్మెల్సీ కోటా ఎన్నిక‌ల్లో వీరికి ప‌ద‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది. అయితే..దీనికిగాను వారు కొన్నాళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.