లాక్ డౌన్ పొడిగింపే.. సంకేతాలిచ్చేసిన కేసీఆర్

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన 21 రోజుల దేశ‌వ్యాప్త లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియ‌నుంది. ఐతే క‌రోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేప‌థ్యంలో లాక్ డౌన్ పొడిగింపు త‌ప్ప‌ద‌న్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. దీనిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏ నిర్ణ‌యం తీసుకుంటారో ఏమో కానీ.. తెలంగాణ‌లో మాత్రం లాక్ డౌన్ పొడిగింపు త‌ప్ప‌ద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజా ప్రెస్ మీట్‌ను బ‌ట్టి ఈ విష‌యం అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో లాక్ డౌన్ కొన‌సాగించ‌డం త‌ప్ప వేరే మార్గంలేద‌ని.. ఎత్తివేస్తే క‌రోనా వ్యాప్తి విప‌రీతంగా పెరిగిపోతుంద‌నే అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. లాక్ డౌన్ కొన‌సాగించాల‌ని ప్ర‌ధానికి తాను సూచించిన‌ట్లు కేసీఆర్ వెల్ల‌డించారు.

‘‘లాక్ డౌన్ ఎత్తేయడం చిన్న విషయం కాదు. ఒక్కసారి తాళం తీస్తే జ‌నాలు ఇక ఆగుతారా? మసీదులు, గుళ్ళు, పబ్బులు.. ఇలా అన్ని చోట్లా కార్యక్రమాలు మొదలు పెడ్తారు. అప్పుడు జరిగే నష్టం మనం భరించలేము. అందుకే మోడీగారు న‌న్ను అడిగితే లాక్ డౌన్ పొడిగిస్తేనే మంచిది అని చెప్పినా’’ అని కేసీఆర్ అన్నారు. మ‌రోవైపు ప్రధాని పిలుపిచ్చిన లైట్ ఫర్ ఇండియా కార్యక్రమాన్ని కూడా కొందరు కుసంస్కారులు సోషల్ మీడియా హేళన చేస్తున్నారని.. ఇలాంటి విపత్కర సమయంలోనే అందరూ ఐక‌మ‌త్యంతో ఉండాల‌ని.. ఇలాంటి వాటిపై విమ‌ర్శ‌లు త‌గ‌వ‌ని కేసీఆర్ అన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎన్నో ఇబ్బందుల‌కు ఓర్చి క‌రోనా బాధితుల‌కు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్భందికి, హాస్పిటళ్ల‌లో స్వీపర్లకి, క్లీన‌ర్ల‌కి అంద‌రికీ చేతులెత్తి దండం పెడుతున్నాన‌ని.. వాళ్ల‌కెంత మొక్కినా తక్కువే అని, వారి త్యాగం చాలా గొప్పద‌ని కేసీఆర్ కొనియాడారు.