చికెన్ ధరలు ఆల్ టైం హై.. కారణమేంటి?

తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల కిందట చికెన్ ధరలు 50 రూపాయల దిగువకు పడిపోయాయి. కరోనా వచ్చిన కొత్తలో చికెన్ తింటేనే ఆ వైరస్ సోకుతుందన్న ప్రచారం గట్టిగా సాగింది. దీంతో జనాలు చికెన్ సెంటర్ల వైపు చూడటమే మానేశారు. సప్లై భారీగా ఉండగా.. సరఫరా తగ్గిపోవడంతో రేట్లు దారుణంగా పడిపోయాయి. కొన్ని చోట్ల కిలో 30-40 రూపాయలకు కూడా ఇచ్చారు. అయినా కూడా జనాలు చికెన్ కొనని పరిస్థితి కనిపించింది.

ఐతే చికెన్ వల్ల కరోనా రాదనే విషయాన్ని గట్టిగా ప్రచారం చేయడం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ విషయంలో స్పష్టత ఇవ్వడంతో జనాల్లో మార్పు వచ్చింది. నెమ్మదిగా అందరూ చికెన్‌కు తిరిగి అలవాటు పడ్డారు. దీంతో క్రమంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా కిలో రూ.300 పలికే పరిస్థితి వచ్చింది.

గత వారం హైదరాబాద్‌లో చికెన్ ధర రూ.230-240 మధ్య ఉండగా.. ఈ ఆదివారానికి అది ఏకంగా రూ.300 మార్కును టచ్ చేసింది. పేపర్ ధరే రూ.290కి చేరిపోయింది. ఇది ఆల్ టైం హై రికార్డు కావడం గమనార్హం. ఒకప్పుడు రూ.250 రికార్డు ధర. దాని మీద ఈసారి 50 పెరిగిపోయింది. మరీ ఈ స్థాయిలో చికెన్ ధరలు పెరిగిపోవడం అనూహ్యం.

ఇందుకు కారణం చికెన్ సప్లై తగ్గిపోవడమే. పౌల్ట్రీ ఫామ్స్‌లో చికెన్ పెంపకానికి 45 రోజుల నుంచి 60 రోజుల దాకా పడుతుంది. ఐతే రెండు నెలల కిందట ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో ఫామ్స్‌లో చికెన్ పెంపకాలు బాగా తగ్గించేశారు. సగానికి సగం ఉత్పత్పి పడిపోయింది. ఇప్పుడు జనాలు లాక్ డౌన్ టైంలో విపరీతంగా నాన్ వెజ్ తింటున్నారు.

కోడి మాంసం విషయంలో సందేహాలన్నీ తొలగిపోవడంతో చికెన్ సెంటర్ల మీద పడుతున్నారు. డిమాండ్ పెరిగింది. అందుకు తగ్గ సప్లై లేదు. దీంతో ధరలు భగ్గుమంటున్నాయి. ఇవి ఇంకా ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి.