ఆనందయ్య నోట సీఎం జగన్ ఇరుకున పడే మాట

ఆనందయ్య మందు ఎపిసోడ్ లో ఏపీ ప్రభుత్వం స్పందించిన తీరు.. ప్రభుత్వమే అండగా నిలిచి మందును భారీ ఎత్తున తయారు చేయిస్తామని చెప్పటం తెలిసిందే. ఈ మందు తయారీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతులు లభించాయి. తొలుత ఈ మందు శాస్త్రీయత మీద సందేహాలు నెలకొన్నాయి. వీటిపై క్లారిఫికేషన్ ఇచ్చేందుకు జగన్ సర్కారు ఐసీఎంఆర్ఐ శాస్త్రవేత్తల సాయాన్ని కోరింది.

దాదాపు 15 రోజుల పాటు మందు తయారీ నిలిచిపోయింది. అనుమతులు లభించిన తర్వాత నుంచి మందు తయారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆనందయ్య వెల్లడించారు. అయితే.. విద్యుత్ సరఫరాలో హెచ్చు తగ్గులతో మెషిన్లు కాలిపోతున్నాయని.. మందు తయారీ నిర్విరామంగా సాగాలంటే కాస్త సమయం పడుతుందన్నారు. తన మీద రాజకీయ ఒత్తిడి లేదని.. తన మందును ముందుగా కొవిడ్ బాధితులకు ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పారు.మందు తయారీకి సాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి ఆన్ లైన్ లో మందును పంపిణీ చేసే ఉద్దేశం తనకు లేదన్నారు. దేశంలో అవసరమైన వారందరికి మందును అందించేలా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఆనందయ్య నోటి నుంచి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మందు తయారీకి సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరానని.. ఇప్పటివరకు సాయం చేయలేదన్న మాట ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఆనందయ్య మందు విషయంలో తమ ప్రభుత్వం సానుకూలంగా స్పందించటమే కాదు.. ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసుకున్నామని.. సందేహాలన్నింటిని తొలగించినట్లుగా వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇలాంటివేళలో స్వయంగా ఆనందయ్యే మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా సాయం అందటం లేదన్న మాట హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆనందయ్య నోట వచ్చిన ఈ మాటలు వీలైనంత త్వరగా సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్లాలంటున్నారు. మందు తయారీకి ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తుందని ఆయనే స్వయంగా చెప్పిన తర్వాత కూడా సాయం అందకపోవటం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంలో సీఎం జగన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆనందయ్య మందును రాష్ట్ర ప్రజలందరికి అందేలా జగన్ బాధ్యత తీసుకోవాలన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.