షారుఖ్.. ఆ లెజెండ్‌ను పక్కన పెట్టి మరీ


ఒకప్పుడు బాలీవుడ్లో నంబర్ వన్ హీరోగా ఉండేవాడు షారుఖ్ ఖాన్. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌ల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ షారుఖ్ రేంజ్ వేరుగా ఉండేది. అతడి సినిమా బడ్జెట్లు, కలెక్షన్లు మిగతా స్టార్ల కంటే ఎక్కువ ఉండేవి. కానీ గత దశాబ్ద కాలంలో తన కెరీర్‌ను చేజేతులా దెబ్బ తీసుకున్నాడు షారుఖ్. వరుసగా చెత్త సినిమాలు చేయడం, వాటిలో చాలా వరకు డిజాస్టర్లు కావడంతో అతడి మార్కెట్ పడిపోతూ వచ్చింది.

చివరికి ‘జీరో’ సినిమాతో షారుఖ్ బాక్సాఫీస్ దగ్గర దారుణమైన పరాభవం ఎదుర్కొన్నాడు. దీని మీద పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిలో పోసిన పన్నీరైంది. ఈ దెబ్బకు షారుఖ్.. రెండేళ్లకు పైగా మరో సినిమా చేయలేకపోయాడు. ఈసారి ఆచితూచి సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్’ను లైన్లో పెట్టాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. దీని తర్వాత షారుఖ్ చేయబోయే సినిమా మీద సస్పెన్స్ నడుస్తోంది.

నిజానికి తన రీఎంట్రీ మూవీని లెజెండరీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానితో చేయాలని అనుకున్నాడు షారుఖ్. ఈ సినిమా కోసం సన్నాహాలు కూడా జరిగాయి. కానీ ఏమైందో ఏమో.. అది పక్కకు వెళ్లి ‘పఠాన్’ ముందుకొచ్చింది. ‘పఠాన్’ అయ్యాకైనా హిరానితో సినిమా ఉంటుందనుకుంటే.. ఇప్పుడు కూడా అది పట్టాలెక్కడం లేదు. హిరాని సినిమాను హోల్డ్ చేసి అట్లీ దర్శకత్వంలో మంచి మసాలా సినిమా చేయడానికే షారుఖ్ పచ్చ జెండా ఊపాడు.

విజయ్‌తో తెరి, మెర్శల్, బిగిల్ లాంటి బ్లాక్ బస్టర్లు కొట్టిన అట్లీ.. రెండేళ్లుగా షారుఖ్‌తో ట్రావెల్ చేస్తున్నాడు. ఎట్టకేలకు ఇద్దరి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయి. స్క్రిప్టు లాక్ అయింది. ఆగస్టులోనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. బాలీవుడ్ మీడియా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. తన సొంత సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్లోనే షారుఖ్ ఈ సినిమా చేయబోతున్నాడట. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.