జ‌గ‌న్ రికార్డ్‌: రాష్ట్రంలో స‌రికొత్త ఒర‌వ‌డి!

ఏపీ సీఎం జ‌గ‌న్ రికార్డు సృష్టించారా? ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ప్ర‌భుత్వ‌మూ(వైఎస్ హ‌యాం స‌హా) చేయ‌ని విధంగా ఆయ‌న పేద‌ల‌కు ఇళ్ల నిర్మాణం చేప‌ట్ట‌డాన్ని ఏ ఒక్క‌రూ త‌ప్పు ప‌ట్ట‌లేక పోతున్నారు. నిజానికి రాష్ట్రం అప్పుల కుప్ప‌గా ఉంది. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ మాత్రం.. తాను ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన్న పేద‌ల‌కు ఇళ్లు ప‌థ‌కంపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు కేటాయించారు. అయితే.. అప్ప‌ట్లో ఈ స్థ‌లాల కేటాయింపుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చినప్ప‌టికీ వాటిని అధిగ‌మించి ముందుకు సాగారు.

గురువారం తన క్యాంప్‌ ఆఫీసు నుంచి వర్చువల్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. గ‌తంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం రెండు విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ఈ రోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవారు ఎక్కడా ఉండకూడదన్నారు. పేదవారి సొంతిళ్లు కల నిజం చేస్తున్నామన్నారు. పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లో మొదటి దశలో గృహ నిర్మాణాలు చేపడుతున్నాం. తొలి విడతలో రూ.28,084 కోట్లతో 15.60 లక్షల పక్కాగృహాల నిర్మాణం చేపడుతున్నాం. వచ్చే ఏడాది జూన్‌ 22 కల్లా తొలి దశ గృహ నిర్మాణాల పనులు పూర్తి చేస్తాం. అని పేర్కొన్నారు.

రెండో దశలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతాం. రెండు దశలు కలిపి రూ.50,940 కోట్లతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. PMAYతో అనుసంధానం చేసుకుని గృహ నిర్మాణాలు చేపడుతున్నాం. 17 వేల వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మిస్తున్నామని సీఎం జగన్ వివ‌రించారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. జ‌గ‌న్ ఏం చేసినా.. విమ‌ర్శించే ప్ర‌తిప‌క్షాల నేత‌ల నుంచి ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు కౌంట‌ర్లు ప‌డ‌క‌పోవ‌డం విశేషం. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.