జగన్.. మోడీ ఆలోచనకు వ్యతిరేకంగా వెళ్తాడా?

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు నిర్వహించే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత పట్టుదలగా ఉన్నాడో తెలిసిందే. మెజారిటీ తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ పరీక్షలు నిర్వహించి తీరాలనే ఆలోచనతో జగన్ ఉన్నాడు. నిజానికి ఇప్పటికే పరీక్షలు మొదలు కావాల్సింది. కానీ కరోనా ఉద్ధృతి దృష్ట్యా పరీక్షలను నెల రోజులు వాయిదా వేశారు. ఐతే నెల రోజుల తర్వాత కూడా కరోనా ముప్పు తొలగిపోతుందన్న గ్యారెంటీ లేదు.

పైగా అప్పుడు పరీక్షలు నిర్వహించి.. మూల్యాంకనానికి ఇంకో 45 రోజులు తీసుకుని.. సర్టిఫికెట్లు జారీ చేసేసరికి మరి కొన్ని రోజులు పడుతుంది. సెప్టెంబరు-అక్టోబరుకు కానీ ఈ విద్యార్థులు ఇంటర్మీడియట్లో చేరలేరు. తర్వాత నాలుగు నెలలకు మించి విద్యా సంవత్సరం ఉండదు. అది ఇంటర్మీడియట్లో వారికి ఇబ్బందే. అవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుత కరోనా ముప్పు నేపథ్యంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటాలు ఆడటం మంచిది కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఈ భయంతోనే తెలంగాణ సహా 14 రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలను రద్దు చేశాయి. కేంద్రం ప్రభుత్వం సైతం సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలను కూడా ఇప్పటికే రద్దు చేయగా.. తాజాగా 12వ తరగతి పరీక్షల విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల కంటే విద్యార్థుల ఆరోగ్యం, భద్రతే తమకు ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.

ఆరోగ్య పరంగా సురక్షితం కాని పరిస్థితుల్లో ఒత్తిడి మధ్య విద్యార్థులను పరీక్ష రాసేందుకు బలవంతం చేయకూడదని ప్రధాని సూచించారు. మరి ప్రధానే ఇలా ఆలోచించినపుడు.. ఏపీ సీఎం ఎందుకు ఇంకా మొండి పట్టు పడుతున్నాడన్న ప్రశ్న తలెత్తుతోంది. సీబీఎస్ఈతో పోలిస్తే రాష్ట్రాల పరిధిలో జరిగే పదో తరగతి పరీక్షలు అంత ముఖ్యం కాదని, ప్రస్తుత అసాధారణ పరిస్థితుల్లో పరీక్షలు రద్దు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని.. విద్యార్థులను సందిగ్ధతలో పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా నిర్ణయం ప్రకటిస్తే మంచిదని మెజారిటీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.