షాక్ఃక‌రోనా వ్యాక్సిన్ ప‌నిచేయ‌ట్లేద‌ని కేసు పెట్టాడు

ఇప్పుడు చ‌ర్చంతా క‌రోనా, ఈ మ‌హ‌మ్మారి రాకుండా చెక్ పెట్టే వ్యాక్సిన్ గురించే. వ్యాక్సిన్ల కొర‌త ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తుంటే తాను కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నప్ప‌టికీ యాంటీబాడీలు వృద్ధి చెంద‌లేదంటూ ఓ వ్య‌క్తి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. యూపీలోని లక్నోకు చెందిన ప్ర‌తాప్ చంద్ర అనే ఆ వ్య‌క్తి ఆషియానా పోలీస్ స్టేష‌న్‌లో ఈ మేర‌కు కేసు పెట్టాడు. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ త‌యారు చేసే సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అద‌ర్ పూనావాలాతోపాటు డీసీజీఏ డైరెక్ట‌ర్‌, ఆరోగ్య శాఖ‌ జాయింట్ సెక్ర‌ట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్‌, ఐసీఎంఆర్ డైరెక్ట‌ర్ బ‌ల‌రామ్ భార్గ‌వ‌, నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్ డైరెక్ట‌ర్ అప‌ర్ణ ఉపాధ్యాయ్‌ల‌పై ప్ర‌తాప్ చంద్ర ఈ మేర‌కు ఫిర్యాదు చేశాడు.

కొవిషీల్డ్ తొలి డోసుతోనే యాంటీబాడీలు బాగా వృద్ధి చెందుతాయ‌ని ఐసీఎంఆర్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ బ‌ల‌రామ్ భార్గ‌వ చెప్పిన నేప‌థ్యంలో తాను ఏప్రిల్ 8న కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాన‌ని ప్ర‌తాప్ చంద్ర ఫిర్యాదులో పేర్కొన్నాడు. తొలి డోసు తీసుకున్న త‌ర్వాత ప్ర‌భుత్వం ఆమోదించిన ల్యాబ్‌లో తాను యాంటీబాడీ జీటీ టెస్టు చేయించుకున్నాన‌ని, త‌న‌లో యాంటీబాడీలు వృద్ధి చెంద‌లేద‌ని తేలిన‌ట్లు అత‌ను ఫిర్యాదులో పేర్కొన్నాడు. యాంటీబాడీలు వృద్ధి చెంద‌క‌పోగా తాను అనారోగ్యానికి గుర‌య్యాయ‌ని, త‌న‌లో ప్లేట్‌లెట్లు స‌గానికి ప‌డిపోయాయ‌ని వాపోయాడు. 28 రోజుల త‌ర్వాత రెండో డోసుకు వెళ్తే ఆరు వారాల త‌ర్వాత ర‌మ్మ‌న్నార‌ని అయితే, ఆ త‌ర్వాత ఈ వ్య‌వ‌ధిని ప్ర‌భుత్వం 12 వారాల‌కు పెంచిందన్నారు.

అయితే వ్యాక్సిన్ ప‌నిచేయ‌ట్లేద‌నే ఈ ఫిర్యాదు విష‌యం సున్నిత‌మైన‌ది కావ‌డంతో ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఎఫ్ఐఆర్ మాత్రం న‌మోదు చేయ‌లేదు. ఉన్న‌తాధికారుల‌ను సంప్ర‌దించిన త‌ర్వాత దీనిపై తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వాళ్లు చెప్పారు. అయితే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌క‌పోతే తాను కోర్టుకు వెళ్తాన‌ని ప్ర‌తాప్ చంద్ర హెచ్చ‌రించడం కొస‌మెరుపు.