ఎన్టీఆర్.. అన్నను వదలట్లేదే


జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్‌ల తండ్రి ఒకరే కానీ.. తల్లులు వేరన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ వేర్వేరుగానే పెరిగారు. ఒక దశ వరకు ఇద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఏమీ లేదు. ‘ఓం’ సినిమా టైంలో ఒక ఇంటర్వ్యూలో తారక్‌తో అనుబంధం గురించి కళ్యాణ్ రామ్‌ను అడిగితే.. తాము చాలా క్లోజ్ అని, రోజూ కలుస్తుంటామని చెప్పలేనని.. అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ మాత్రం ఉంటామని వ్యాఖ్యానించాడు. ఎన్టీఆర్ హీరోగా అరంగేట్రం చేసినపుడు, స్టార్‌గా ఎదుగుతున్నపుడు కళ్యాణ్‌ రామ్‌తో అంత క్లోజ్‌గా ఏమీ లేడన్నది అందరికీ తెలిసిన విషయమే.

ఐతే హరికృష్ణ మరో కొడుకు, కళ్యాణ్ రామ్ అన్నయ్య జానకి రామ్ చనిపోయినపుడు.. ఆ విషాద సమయంలో తారక్, కళ్యాణ్ రామ్ దగ్గరయ్యారు. హరికృష్ణ మరణానంతరం ఒకరికి ఒకరు అన్నట్లుగా ఇద్దరూ ఇంకా చేరువయ్యారు. ఇక అప్పట్నుంచి ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల్లాగే వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సినిమాలను తారక్ ప్రమోట్ చేయడం.. తారక్ సినిమాల వేడుకలకు కళ్యాణ్ రామ్ రావడం.. ఇతర సమయాల్లోనూ ఇద్దరూ ఒకటిగా కలిసి అడుగులు వేస్తుండటం గమనించవచ్చు.


కళ్యాణ్ రామ్ సినిమాల నిర్మాణంతో సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అని అందరికీ తెలుసు. అతనొక్కడే, పటాస్ మినహా అన్నీ అతడికి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. అతడి నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ కష్టాల్లో ఉండగా తారక్ ఆ బేనర్లో ‘జై లవకుశ’ చేసి దానికి మంచి లాభాలు అందించాడు. అంతటితో ఆగిపోకుండా ఇప్పుడు వరుసగా తన చిత్రాల్లో ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ను తారక్ భాగస్వామ్యం చేస్తుండటం విశేషం.

ఇటీవలే ప్రకటించిన కొరటాల శివ చిత్రానికి మిక్కిలినేని సుధాకర్ నిర్మాత కాగా.. దీనిలో కళ్యాణ్ రామ్‌కు కూడా షేర్ ఇప్పించాడు. నిజానికి దీనికి ముందు త్రివిక్రమ్‌తో అనుకున్న చిత్రానికి కూడా కళ్యాణ్ రామ్ భాగస్వామే. కానీ అది క్యాన్సిల్ కావడంతో శివ చిత్రంలోకి అన్నయ్యను తీసుకొచ్చాడు. దాని బదులు ఇది అనుకున్నారు కానీ.. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ బేనర్లో ప్రశాంత్ నీల్‌తో చేయబోయే సినిమాలోనూ కళ్యాణ్ రామ్‌ను భాగస్వామిని చేశాడు తారక్.

త్రివిక్రమ్‌తో ఇప్పుడు సినిమా క్యాన్సిల్ అయినా.. తర్వాత ఉండొచ్చు అంటున్నారు. అది మొదలైనపుడు మళ్లీ కళ్యాణ్ రామ్ వచ్చినా ఆశ్చర్యం లేదేమో. బహుశా చాలా మంది హీరోలు సొంత బేనర్లు పెట్టి తమ సినిమాల్లో పార్టనర్‌షిప్‌ తీసుకుంటున్నట్లు తారక్ అన్నయ్య బేనర్‌ను వివిధ ప్రాజెక్టుల్లోకి తీసుకొస్తున్నట్లుంది.