సల్మాన్ ధాటికి ఓటీటీ క్రాష్

బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మాస్ స్టార్లలో ఒకడు సల్మాన్ ఖాన్. అమితాబ్ బచ్చన్ హవాకు తెరపడ్డాక.. ఖాన్ త్రయంలో ముగ్గురూ వేర్వేరు కాలాల్లో ఆధిపత్యం చలాయించిన వాళ్లే కానీ.. గత దశాబ్దంలో మాత్రం సల్మాన్‌దే హవా. షారుఖ్ ఖాన్ జోరు ఈ దశాబ్దంలో బాగా తగ్గిపోగా.. ఆమిర్ ఖాన్ రెండు మూడేళ్లకు ఓ సినిమా మాత్రమే చేస్తాడు. అవి ఎక్కువగా క్లాస్ టచ్‌తో ఉంటాయి. కానీ సల్మాన్ తరచుగా సినిమాలు అందిస్తుంటాడు. అవి మాస్‌ను ఉర్రూతలూగించేస్తుంటాయి. ప్రధానంగా అభిమానులు, మాస్ ప్రేక్షకుల కోసమే సల్మాన్ సినిమాలు చేస్తుంటాడు.

కరోనా మహమ్మారి కారణంగా ఏడాదిగా బాలీవుడ్లో స్తబ్దత నెలకొని ఉండగా.. ఈ రంజాన్ పండక్కి ధైర్యం చేసిన తన కొత్త చిత్రం ‘రాధె’ను రిలీజ్ చేశాడు భాయ్. ఒకేసారి థియేటర్లలో, ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఐతే ఇండియాలో దాదాపుగా అన్ని చోట్లా థియేటర్లు మూతపడి ఉండగా.. ఇక్కడ థియేట్రికల్ రిలీజ్ నామమాత్రమే.

ఇంటర్నేషనల్ మార్కెట్లలో ఈ సినిమాకు పెద్ద రిలీజ్ దక్కింది. ఓపెనింగ్స్ కూడా భారీగానే వస్తాయని భావిస్తున్నారు. ఇండియా విషయానికి వస్తే ‘రాధె’ చిత్రాన్ని జీప్లెక్స్, జీ5 ఓటీటీలతో పాటు.. రెండు డీటీహెచ్ సర్వీస్‌ల ద్వారా కూడా రిలీజ్ చేశారు. ఐతే సల్మాన్ సినిమా కోసం ఎదురు చూసే అభిమానులు దేశవ్యాప్తంగా కోట్లల్లోనే ఉంటారు. వాళ్లందరూ ఒకేసారి ‘జీ’ ఓటీటీల మీద పడిపోవడంతో సమస్య తప్పలేదు.

‘రాధె’ను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తారని ముందు ప్రకటించారు. ఐతే ఉదయం 11 గంటలకే స్ట్రీమింగ్ మొదలైంది. కొందరు అప్పట్నుంచే సినిమా చూడ్డం మొదలుపెట్టారు. 12 గంటలకు టైమింగ్ నోట్ చేసుకుని అప్పుడు సినిమా చూద్దామని ఒక్కసారిగా అభిమానులు ఈ ఓటీటీ మీద పడటంతో దాని సర్వర్ క్రాష్ అయిపోయింది. యాప్ ఓపెన్ కాక లక్షల మంది ఇబ్బంది పడ్డారు. ఇది చూసి సల్మాన్ ఖానా మజాకా.. భాయ్ ధాటికి ఓటీటీనే క్రాష్ అయిందే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఎలివేషన్లు ఇస్తున్నారు. ఐతే కొన్ని గంటల తర్వాత సర్వర్‌ను పునరుద్దరించి అందరూ సినిమా చూసేలా చేయగలిగారు.