క‌రోనా సెకండ్ వేవ్‌.. రోజుల త‌ర‌బ‌డి ఆసుప‌త్రుల్లోనే!

క‌రోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోంది. గ‌త ఏడాది ఫ‌స్ట్ వేవ్ వ‌చ్చినా.. ఇంట్లోనే ఉంటూ.. హోం క్వారంటైన్ విధానాన్ని అవలంభిస్తే.. క‌రోనా బారి నుంచి ర‌క్షించుకునేందుకు అవ‌కాశం ఉండేది. పైగా ఆక్సిజ‌న్ స‌మ‌స్య ఎవ‌రికీ పెద్ద రాలేదు. కానీ, సెకండ్ వేవ్‌లో అనే స‌మ‌స్య‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. క‌రోనా రోగులు పెరుగుతుండ‌డం.. వారికి కూడా ఆక్సిజ‌న్ భారీ స్థాయిలో అవ‌స‌రం రావ‌డం.. గ‌మ‌నార్హం. అంతేకాదు.. పెద్ద ఎత్తున ఆసుప‌త్రుల్లో చేరే రోగుల సంఖ్య కూడా ఎక్కువ‌గా ఉండ‌డం గ‌మ‌నార్హం.

వైద్య‌నిపుణులు ఏంచెబుతున్నారంటే.. “ఈ వైర‌స్‌లు కొన్నిసార్లు వాటంత‌ట అవే రూపాంతరం చెందుతాయి. ఈ కొత్త స్ట్రెయిన్‌.. మాన‌వ శ‌రీరంలోని ఇమ్యూనిటీ షీల్డ్స్‌ను బ్రేక్ చేస్తాయి. దీంతో తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతాయి. అయితే.. ఇది స‌ర్వ‌సాధార‌ణం కాదు. ప్ర‌స్తుతం దీనిపై ప‌రిశోధ‌న‌లు సాగుతున్నాయి. ఇక‌, ఈ వైర‌స్ కార‌ణంగా .. పేషంట్ల సంఖ్య మ‌రింత పెరిగిపోతుంది. అదేస‌మ‌యంలో సుదీర్ఘ కాలంపాటు ఆసుప‌త్రిలో చికిత్స పొందాల్సిన అవ‌స‌రం ఉంటుంది” అని వివ‌రించారు.

ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నా ప్ర‌కారం ఒక వ్య‌క్తికి రూపాంతరం చెందిన వైర‌స్ వ్యాపిస్తే.. క‌నీసం 25 రోజుల పాటు ఆసుప‌త్రుల్లో చికిత్స పొందాల్సిన అవ‌స‌రం రావొచ్చు. ఈ ప‌రిణామం తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇక‌, ఆసుప‌త్రుల్లో ఉండాల్సి రావ‌డంతో కొంద‌రు ఈ ఖ‌ర్చులు భ‌రించ‌లేక పోతున్నారు. ఇక‌, ఆసుప‌త్రుల్లో ఎక్కువ కాలం ఉండేవారు కూడా చాలా ఇబ్బందిగా భావించాల్సి వ‌స్తోంది.

“మా నాన్న‌గారి కోసం ఇప్ప‌టి వ‌ర‌కు రూ.18 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టాను. ప్ర‌స్తుతం ఆయ‌న 12 రోజులుగా ఆక్సిజ‌న్ మ‌ద్ద‌తుతో జీవిస్తున్నారు. మా నాన్న‌.. వెంటిలేట‌ర్‌పై లేరు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కు సోకిన ఇన్ ఫెక్ష‌న్ పోలేదు. ఆయన కోలుకునేందుకు మ‌రో వారం రోజులు ప‌డుతుంద‌ని.. వైద్యులు చెబుతున్నారు” అని హైద‌రాబాద్‌కు చెందిన ఎన్నారై ఒక‌రు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇక‌, రెండో ద‌శ‌లో క‌రోనా బారిన ప‌డిన వారిలో అనేక రుగ్మ‌త‌లు క‌నిపిస్తున్నాయ‌ని.. వైద్యులు పేర్కొంటున్నారు. ఎక్కువ రోజులు ఆసుప‌త్రుల్లో ఉంటున్నంద‌న వారిలో ఆందోళ‌న క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. అయితే.. అదే స‌మ‌యంలో కొవిడ్ అనంత‌రం కూడా ఊపిరి తిత్తుల స‌మ‌స్య తెర‌మీదికి వ‌స్తోంద‌ని అంటున్నారు. ఇలాంటి వారికే ఆక్సిజ‌న్ అత్య‌వ‌స‌రం అవుతోంద‌ని చెబుతున్నారు.