ప్రభుత్వాలపై పెరిగిపోతున్న ఒత్తిడి

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత పెరిగిపోతున్నకొద్దీ లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వాలపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత తగ్గాలంటే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించటం ఒకటే ఏకైక మార్గమని ఒకవైపు న్యాయస్ధానాలు మరోవైపు శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. దీంతో లాక్ డౌన్ పెట్టక వేరే దారి కనబడటంలేదు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సుప్రింకోర్టు, రాష్ట్రాల ప్రభుత్వాలపై హైకోర్టులు అనేకసార్లు లాక్ డౌన్ విధించే విషయాన్ని పరిశీలించమని చెప్పాయి. లాక్ డౌన్ విధిస్తే ఆర్ధికంగా తీరని నష్టాలు తప్పవన్న ఏకైక కారణంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి. అయితే ఆర్ధిక విషయాల గురించి ఆలోచిస్తుంటే పోతున్న ప్రజల ప్రాణాల గురించి ఎవరు ఆలోచించాలి ? అంటు కోర్టులు ప్రభుత్వాలను చాలా సీరియస్ గా ఆక్షేపిస్తున్నాయి.

ఇదే సమయంలో శాస్త్రజ్ఞులు, వైద్య నిపుణులు మాట్లాడుతు కరోనా వైరస్ తీవ్రతను అడ్డుకోవటానికి లాక్ డౌన్ పెట్టక వేరేమార్గం లేదని పదే పదే సలహాలిస్తున్నారు. దీంతో లాక్ డౌన్ విధించే విషయంలో ప్రభుత్వాలపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. వీళ్ళ సలహాలు, సూచనల సంగతిని పక్కన పెట్టేస్తే ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నది మాత్రం వాస్తవం. రోజుకు వేలాదిమంది చనిపోతున్నారు. అలాగే రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

కరోనా వైరస్ మొదటి దశతో పోల్చుకుంటే రెండో దశ చాలా వేగంగా వ్యాపిస్తోంది. అలాగే తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. రెండో దశ వైరస్ సోకిన రోగుల్లో ఊపిరితిత్తులు, గుండె పై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. దీనివల్ల ఆక్సిజన్ అవసరం ఒక్కసారిగా పెరిగిపోతోంది. అందుకనే రోజుకు 450 టన్నుల ఆక్సిజన్ సరఫరా ఉన్నా జనాలకు సరిపోవటంలేదు. ముందు రోజుల్లో ఆక్సిజన్ అవసరం రోజుకు వెయ్యిటన్నులు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా లాక్ డౌన్ విధించే విషయంలో ప్రభుత్వాలపై ఒత్తిడి పెరిగిపోతోందన్నది మాత్రం వాస్తవం.