ఐపీఎల్‌ను ఆపక తప్పదా?

ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ సీజన్ ఆరంభానికి ముందే కరోనా కల్లోలం.. టోర్నీ మీద సందేహాలు రేకెత్తించింది. కొందరు ఆటగాళ్లతో పాటు ముంబయిలోని వాంఖడె గ్రౌండ్స్‌మెన్, అలాగే బ్రాడ్‌కాస్టర్ అయిన హాట్ స్టార్‌కు చెందిన సిబ్బంది పెద్ద ఎత్తున కరోనా బారిన పడటం తెలిసిందే. 40 మందికి పైగా పాజిటివ్‌గా తేలడంతో టోర్నీ మొదలవకుండానే ఆగిపోతుందా అన్న సందేహాలు రేకెత్తాయి. ఐతే తదుపరి అంతగా కేసులు నమోదవకుండా చూసుకుని, కట్టుదిట్టంగా వ్యవహరించడం ద్వారా లీగ్‌ను అనుకున్నట్లే మొదలుపెట్టగలిగారు. కొనసాగించగలిగారు.

ముంబయిలో లాక్‌డౌన్ పెట్టినా సరే.. లీగ్‌కు ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. ఇంతటితో గండం గట్టెక్కినట్లే అనుకున్నారు. లీగ్ దశలో సగం మ్యాచ్‌లు పూర్తయిపోవడంతో ఇక టోర్నీ భవితవ్యంపై ఎవరికీ సందేహాలు కూడా లేకపోయాయి. కానీ ఉన్నట్లుండి లీగ్‌లో ఇప్పుడు మళ్లీ కరోనా కల్లోలం మొదలైంది. లీగ్‌ను అర్ధంతంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడ్డారన్న వార్తతో ఆందోళన మొదలైంది. ఆ తర్వాత చెన్నై జట్టుకు చెందిన శిబిరంలో ముగ్గురు కరోనా బారిన పడ్డట్లు వెల్లడైంది. చెన్నై సీఈవో విశ్వనాథన్‌తో పాటు కోచ్ బాలాజీ, చెన్నై టీం బస్ సిబ్బంది ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలారు. బయో బబుల్ లోపల ఇలా కేసులు బయటపడ్డాయంటే వైరస్ ప్రభావం ఇంతటితో ఆగేది కాదు.

ఎక్కడో బయో బబుల్ ఛైన్ తెగింది. రెండు జట్లలో కేసులు బయటపడ్డాయి. ఒక పట్టాన కేసులు ఆగుతాయన్న అంచనాల్లేవు. రెండు నెలల కిందట పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో సరిగ్గా ఇలాగే జరిగింది. టోర్నీ మధ్యలో కొన్ని కేసులు వెలుగు చూశాయి. అవి క్రమంగా పెరిగిపోయాయి. ఒకట్రెండు మ్యాచ్‌లు ఆపి, వాయిదా వేశారు. అయినా కేసులు ఆగలేదు. లీగ్‌ను పూర్తిగా ఆపేయక తప్పలేదు. ఇప్పుడు ఐపీఎల్ బబుల్లో కేసులు ఆగని పక్షంలో లీగ్‌ను ఆపడం తప్ప మరో మార్గం లేదు. కేసులేమీ లేనపుడే.. ఇండియాలో ఇలా కరోనా విలయం సాగుతున్నపుడు ఐపీఎల్ ఏంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. విదేశీ ఆటగాళ్లలో విపరీతమైన భయం నెలకొంది. ఇప్పుడు కేసులు వెలుగు చూశాయి. అవి మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. మరిన్ని కేసులు బయటపడితే విదేశీ ఆటగాళ్లు మేం ఆడం అని భీష్మించొచ్చు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-14ను మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి తలెత్తినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.