నాయకులారా.. ఈ అవకాశాన్ని ఎందుకు వాడుకోరు?

కోవిడ్ తీవ్రత ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడం కూడా కష్టంగా ఉంది. కేసులు, మరణాల విషయంలో సరైన గణాంకాలు కూడా బయటికి రావట్లేదు. వాస్తవ కేసులు, మరణాల సంఖ్యతో పోలిస్తే ప్రభుత్వాలు బయటికి 30 శాతం తక్కువ చెబుతున్నట్లుగా వార్తలొస్తుండటం గమనార్హం. పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పిపోగా.. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు.

ఇలాంటి సమయంలో పెద్ద మనసున్న దాతల కోసం బాధితులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సరైన వైద్యం అందక కొందరు.. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క కొందరు.. ఆక్సిజన్ అందక కొందరు.. రెమ్డెవిసర్ దొరక్క ఇంకొందరు.. సమయానికి వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్ల ఇంకొందరు ప్రాణాలు వదులుతున్నారు. స్వచ్ఛంద సంస్థలతో పాటు మానవతా వాదులు తమ వంతుగా బాధితులను ఆదుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.

ఐతే మిగతా ఏ వర్గాలకు చెందిన వాళ్లతో పోల్చి చూసినా రాజకీయ నాయకుల బలం ఎక్కువ. వాళ్లు అనుకుంటే క్షణాల్లో అన్నీ జరిగిపోతాయి. ఎన్నికలు వచ్చినపుడు ఓటుకు ఐదు వేలు, పది వేలు కూడా ఇవ్వడానికి వెనుకాడని రాజకీయ నాయకులు.. ఈ కష్ట కాలంలో ఏం చేస్తున్నారన్నది ప్రశ్నగా మారింది. ఎన్నికల సమయంలో ఐదు వేలిచ్చినా ఓటు వేస్తాడన్న గ్యారెంటీ లేదు. కానీ ప్రస్తుత సమయంలో ఆక్సిజన్ అవసరమైన వ్యక్తికి సిలిండర్ ఏర్పాటు చేస్తే.. లేదా ఆసుపత్రిలో బెడ్ ఇప్పిస్తే.. లేదా వ్యాక్సిన్ వేయించి కరోనా ప్రమాదాన్ని తప్పిస్తే.. కచ్చితంగా ఎప్పటికీ ఆ సాయాన్ని మరిచిపోడు. ప్రాణం కాపాడిన వ్యక్తిని ఎవరైనా ఎందుకు మరిచిపోతారు. ఒక నియోజకవర్గంలో ఎన్నికల సమయాన 50 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడని వాళ్లు.. ఇప్పుడు కొన్ని కోట్లు ఖర్చు చేసినా కరోనా బాధితులందరూ సేవ్ అవుతారు.

కొన్ని కోట్లు పెట్టి తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేయొచ్చు. లేదా ఆక్సిజన్ ప్లాంటు నిర్మించొచ్చు. లేదా ఆక్సిజన్ దొరికే చోటు నుంచి సిలిండర్లు తెప్పించొచ్చు. అన్నింటికీ మించి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రెమ్డెవిసిర్ మందులు అందజేయలిగితే ఆ నాయకుడు జనాల్లో దేవుడు అయిపోవడం ఖాయం. ఇలా చేస్తే సోషల్ మీడియాలో మామూలు ప్రచారం జరగదు. నాయకులకు గొప్ప ఇమేజ్ వస్తుంది. రాజకీయ నేతలు ఈ దిశగా ఆలోచిస్తే తర్వాతి ఎన్నికల్లో విజయానికి కర్చీఫ్ వేసేసినట్లే.