‘జాతిరత్నాలు’పై ఇన్ని విమర్శలెందుకు?

కరోనా విరామం తర్వాత తెలుగు నుంచి వచ్చిన బిగ్గెస్ట్ హిట్లలో ‘జాతిరత్నాలు’ ఒకటి. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ లాంటి కామెడీ హీరోలను పెట్టి ‘పిట్టగోడ’ అనే ఫ్లాప్ సినిమా తీసిన అనుదీప్ రూపొందించిన చిత్రమిది. విడుదలకు ముందే ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. ఇక రిలీజ్ తర్వాత ఏం జరిగిందో తెలిసిందే. పెద్ద సినిమాల స్థాయిలో సినిమాకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి. సినిమా రెండు మూడు వారాల పాటు ఇరగాడేసింది. రూ.30 కోట్లకు పైగా షేర్ రాబట్టి ఔరా అనిపించింది. థియేటర్లలో సినిమా చూసిన వాళ్లందరూ దీని గురించి పాజిటివ్‌గానే మాట్లాడారు. ఈ మధ్య కాలంలో ఇంతగా నవ్వించిన సినిమా లేదనే అన్నారు. కథా కథనాలు సిల్లీగానే ఉన్నప్పటికీ.. కామెడీకి ఢోకా లేదని, బాగా నవ్వుకున్నామనే అన్నారు చూసిన వాళ్లందరూ. రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి.

ఈ సినిమాను థియేటర్లలో చూడలేకపోయిన వాళ్లు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూశారు. థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజులకు అమేజాన్ ప్రైమ్‌లోకి వచ్చిందీ చిత్రం. కానీ ఓటీటీలో సినిమా చూసిన వాళ్లలో చాలామంది పెదవి విరుస్తున్నారు. ఇదేం సిల్లీ సినిమా రా నాయనా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటు ట్విట్టర్లో, అటు ఫేస్ బుక్‌లో ఇదో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సినిమా బాలేదంటూ ఒకరు పోస్ట్ పెడితే.. దాని కింద చాలామంది అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సినిమాకు అంత పెద్ద సక్సెస్ ఎలా ఇచ్చారంటూ ప్రేక్షకులను నిందిస్తున్నారు. ‘జాతిరత్నాలు’ టీం మీద కూడా విమర్శలు గుప్పించేస్తున్నారు.

ఐతే థియేటర్లలో సినిమా చూసిన వాళ్ల అభిప్రాయానికి, ఓటీటీలో చూస్తన్న వాళ్ల ఒపీనియన్‌కు ఇంత వైరుధ్యం ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఐతే కొన్ని సినిమాలు థియేటర్లలో చూస్తే కలిగే అనుభూతి వేరుగా ఉంటుంది. ‘జాతిరత్నాలు’ అలాంటి సినిమానే. థియేటర్లలో భారీ జనాల సందడి మధ్య ఈ సినిమా చూస్తున్నపుడు ఉన్న జోష్.. ఓటీటీలో ఒక్కరే కామ్‌గా చూస్తున్నపుడు ఉండదు. థియేటర్లలో లాజిక్కుల గురించి పట్టించుకోకుండా అందరితో కలిసి నవ్వేస్తాం. ఒక దశ దాటాక కథ ఎటు పోతోందన్న ఆలోచన కూడా కలగదు. కానీ ఓటీటీలో లాజిక్కులు వెతుక్కుంటూ.. ఈ సీన్ ఏంటి ఇంత సిల్లీగా ఉంది అనుకుంటూ చూడటం వల్ల తేడా కొడుతుండొచ్చు.