టీడీపీ పై ఫ్రైడే ఎఫెక్ట్‌.. అన్న‌దే జ‌రిగిందా ?

టీడీపీ ఏమ‌ని విమ‌ర్శ‌లు గుప్పించిందో .. జ‌గ‌న్ ఇప్పుడు అదే చేస్తున్నారా ? టీడీపీ నేత‌లు.. ఏయే విష‌యాల‌పై త‌న‌ను విమ‌ర్శించారో.. ఖ‌చ్చితంగా ఆయా అంశాల‌పైనే .. వారిపై జ‌గ‌న్ క‌సి తీర్చుకుంటున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు విశ్లేష‌కులు. టీడీపీ అధికారంలో ఉన్ప‌ప్పుడు.. వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూసేవి. ముఖ్యంగా అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న జ‌గ‌న్‌ను ఆట‌ప‌ట్టించేందుకు టీడీపీ నేత‌లు వ‌రుస పెట్టి ఆయ‌న‌ను విమ‌ర్శించేవారు. నేర‌స్తుడు.. అని .. శుక్ర‌వారం శుక్ర‌వారం కోర్టుకు వెళ్తార‌ని.. విమ‌ర్శించేవారు.

మా నాయ‌కుడు సోమ‌వారం సోమవారం .. పోల‌వ‌రం ప్రాజెక్టు ద‌గ్గ‌ర ఉంటారు. మ‌రి మీ నాయ‌కుడు.. శుక్ర‌వారం.. శుక్ర‌వారం ఎక్క‌డ ఉంటారో .. చెప్ప‌గ‌లరా? అంటూ.. అప్ప‌టి మంత్రి అచ్చెన్నాయుడు ప‌దే ప‌దే ప్ర‌శ్నించేవారు. అదేవిదంగా అప్ప‌టి మంత్రి కొల్లు ర‌వీంద్ర కూడా త‌క్కువేమీ తిన‌లేదు అని అనిపించుకునేందుకు.. అధ్య‌క్షా.. మాది సోమ‌వారం పాల‌న‌. శుక్ర‌వారం పాల‌న కాదు అని చురక‌లు అంటించిన సంద‌ర్భాలు అసెంబ్లీలో అనేకం ఉన్నాయి.

ఇక‌, ఇప్పుడు తాజాగా అరెస్ట‌యిన ధూళిపాళ్ల న‌రేంద్ర కూడా.. జ‌గ‌న్‌ను 420గా అభివ‌ర్ణించారు. అది కూడా అసెంబ్లీలోనే కావ‌డం గ‌మ‌నార్హం. బ‌హుశ ఇవ‌న్నీ.. జ‌గ‌న్ మైండ్‌లో గుర్తు పెట్టుకున్నారో.. లేక ఎక్క‌డైనా రాసుకున్నారో.. తెలియ‌దు కానీ.. అచ్చం వారిని ఆయా రోజుల్లోనే అరెస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో ఈఎస్ఐ కుంభ‌కోణంలో పాత్ర ఉంద‌ని పేర్కొంటూ.. అచ్చెన్న‌ను అరెస్టు చేసింది కూడా శుక్ర‌వార‌మే. ఇక కొల్లు ర‌వీంద్ర‌పై బుధ‌వారం కేసు న‌మోదైతే.. పోలీసులు శుక్ర‌వారం కోసం వెయిట్ చేసి మరీ ఇంటికి వెళ్లారు.

ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈరోజే అరెస్టు చేస్తాం అని కృష్ణా ఎస్పీ కూడా ప్ర‌క‌టించి.. అనుకున్న‌ట్టుగా ఆయ‌న‌ను దారిలో అరెస్టు చేశారు. ఇక‌, ఇప్పుడు ధూళిపాళ్ల‌ను కూడా శుక్ర‌వారం తెల‌తెల వారుతుండ‌గానే అరెస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ఈ ప‌రిణామాలు టీడీపీకి ప్రైడే ఎఫెక్ట్ బాగానే త‌గిలిన‌ట్టుందే.. అని అనిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.