మోడీదే త‌ప్పు.. నిప్పులు చెరిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా!

దేశంలో క‌రోనా 2.0 తీవ్ర‌త రోజు రోజుకు పెరుగుతోంది. ప్ర‌పంచ‌స్థాయి రికార్డులను న‌మోదు చేస్తూ.. కేసులు పెరుగుతున్నాయి. ఒక్క‌రోజులోనే 3ల‌క్ష‌ల పైచిలుకు కేసులు న‌మోద‌వుతున్న దేశంగా అమెరికా త‌ర్వాత భార‌త్ ఉండ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. కేసుల తీవ్ర‌త‌కు తోడు ఆక్సిజ‌న్ కొర‌త‌, వైద్య స‌దుపాయాల లేమి వంటివి దేశ ప్ర‌జ‌ల‌ను మ‌రింత క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో దేశీయ మీడియా విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. అంత‌ర్జాతీయ మీడియా భార‌త్‌లో నెల‌కొన్న ప‌రిణామాల‌పై నిప్పులు చెరిగింది. త‌ప్పంతా.. ప్ర‌ధాని మోడీదేన‌ని, ఎన్నిక‌ల పేరుతో చేసిన రాజ‌కీయ‌మేన‌ని, త‌ద్వారా ప్ర‌జ‌ల‌ను స్వేచ్ఛ‌గా వ‌దిలేశార‌ని పేర్కొంటూ… సంపాద‌కీయాలు, వ్యాసాలు, వార్త‌ల రూపంలో తీవ్రంగా విరుచుకుప‌డింది. వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, ఏబీసీ(ఆస్ట్రేలియా) వంటి సంస్థలు భారత్‌లోని పరిస్థితిపై పలు వార్తలు ప్రచురించాయి.

ఏ దేశం ఏమందంటే..

వాషింగ్ట‌న్ పోస్ట్‌(అమెరికా)
భారత్‌లో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసుల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తోంది. భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి విచారకరమని వ్యాఖ్యానించిన వాషింగ్టన్ పోస్ట్.. జాగ్రత్తలు కొనసాగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపింది. “కరోనా ఆంక్షలు ముందస్తుగానే సడలించడంతో కరోనా పేట్రేగిపోయింది. ఇది సూదురంగా ఉన్న దేశంలోని సమస్య కాదు. ప్రస్తుత సంక్షోభ స్థితిలో ఎంతటి దూరాన ఉన్న దేశమైనా సమీపాన ఉన్నట్టే” అంటూ అమెరికా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. భార‌త్ ప్ర‌భుత్వం ముందుగా క‌ట్టడి చేసినా.. త‌ర్వాత విరామం ఇచ్చేసింద‌ని పేర్కొంది.

ది గార్డియ‌న్‌
భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అతివిశ్వాసం కారణంగానే కరోనాను ఎదుర్కొవడంలో భారత్ ప్రభుత్వం తడబడిందంటూ ది గార్డియన్ తన ఎడిటోరియల్‌లో ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదే పత్రికలో రెండు వ్యాసాల‌ను ప్ర‌చురించారు. భారత్‌లోని పరిస్థితి ప్రపంచానికి గుణపాఠం కావాలి అని కూడా వ్యాఖ్యానించింది. ఆసుప‌త్రిల్లో వైద్యం అంద‌క ల‌క్ష‌ల మంది రోగులు అల్లాడుతున్నారంటూ.. కొన్ని ఫొటోల‌ను కూడా ప్ర‌చురించింది.

న్యూయార్క్ టైమ్స్‌
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రభుత్వం తప్పటడుగులు, ప్రజల నిర్లక్ష్యమే సంక్షోభం తీవ్రమవడానికి కారణం అని న్యూయార్క్ టైమ్స్ స్పష్టం చేసింది. ఈ కారణాల రీత్యా విజయం దిశగా వెళుతున్న భారత్ కథ ఒక్కసారిగా మలుపు తిరిగింది అని పేర్కొంది. భారత్‌లో పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఇది ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కూడా న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. ఇన్ఫెక్షన్లను నిరోధించడం, టీకాలు విస్తృతంగా అందుబాటులోకి తేవడమే ప్రస్తుతం భారత్ ముందున్న మార్గమని పేర్కొంది.

ఏబీసీ(ఆస్ట్రేలియా)
కరోనా నిబంధనలను నిర్లక్ష్యం చేయడమే ప్రస్తుత పరిస్థితి కారణమని ఏబీసీ మీడియా తేల్చింది. సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదనే అభిప్రాయం నిపుణుల్లో ఉందని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో లోపాలు, ప్రజల్లో అలసత్వం, కొత్త వేరియంట్లు ఉనికిలోకి రావడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని ప్రచురించింది.

టైమ్స్‌(బ్రిట‌న్‌)
భార‌త్‌లో సంక్షోభానికి బాధ్యత ప్రభుత్వానిదే అని టైమ్స్ స్పష్టం చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించింది. అంతేకాకుండా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు రాజకీయంగా పైచేయి సాధించడంపై దృష్టి పెట్టడం, ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌తో వైరస్ మరో దాడి చేసిందని వ్యాఖ్యానించింది.

గ్లోబ‌ల్ టైమ్స్‌(చైనా)
కరోనా 2.0ను అడ్డుకోవడంలో రక్షణాత్మక విధానాన్ని భార‌త్ వ‌దిలేసి.. చాలా పెద్ద‌ తప్పు చేసిందని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది. పేదరికం, జనాభా అధికంగా ఉన్న భారత్‌లో కరోనా కేసులు పెరుగుదల..మరికొన్ని వారాలు పాటు కొనసాగుతుందని పేర్కొంది.

డాన్‌(పాకిస్థాన్‌)
భారత్‌‌ ఆస్పత్రుల్లో దర్శనమిస్తున్న దృశ్యాలు గుండెలు పిండేస్తున్నాయని పాకిస్థాన్‌కు చెందిన ‘డాన్’ పేర్కొంది. భార‌త ప్ర‌భుత్వానికి ఈ క్లిష్ట స‌మ‌యంలో సంఘీభావం ప్ర‌క‌టిస్తున్న‌ట్టు పేర్కొంది. అయితే.. భార‌తీయ పౌరుల‌ను త‌మ దేశంలోకి, త‌మ పౌరుల‌ను భార‌త్‌కు అనుమ‌తించేది లేద‌ని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ట్టు డాన్ వివ‌రించింది.