ప్రభాస్ సినిమా.. ప్రతిదీ కొత్తే


ప్రభాస్ చేస్తున్న, చేయబోతున్న చిత్రాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న వాటిలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఒకటి. ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ చిత్రాలు ఎలా ఉంటాయన్నదానిపై ఒక అంచనా ఉంది. వాటి జానర్లో అంత కొత్తవేమీ కావు. ఆ కథల్లోనూ పెద్దగా కొత్తదనం ఉంటుందన్న అంచనాలు లేవు. కానీ ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోయేది మాత్రం ఇండియాలో మరీ ఎక్కువ సినిమాలేమీ తీయని జానర్. కొంచెం ఫాంటసీ టచ్ ఉన్న సైంటిఫిక్ థ్రిల్లర్ అది. ‘ఆదిత్య 369’ లైన్లో సాగుతుందా చిత్రం. ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తోంది చిత్ర బృందం.

ఆదిపురుష్, సలార్ చిత్రాల కంటే ముందు ఈ సినిమా అనౌన్స్ అయినా.. వాటి తర్వాత ఇది పట్టాలెక్కుతుండటానికి ప్రి ప్రొడక్షన్ వర్క్ మీద ఏడాదికి పైగా పని చేయాల్సి రావడమే కారణం.

ఈ సినిమా కోసం ఇంతకుముందు ఎన్నడూ చూడని కొత్త ప్రపంచాన్ని తీర్చిదిద్దుతున్నట్లు, అందులో వాహనాలన్నీ కొత్తగా ఉండబోతున్నట్లు ఇది వరకే ఓ ఇంటర్వ్యూలో సంకేతాలు ఇచ్చాడు నాగ్ అశ్విన్. శుక్రవారం తన పుట్టిన రోజు సందర్భంగా నాగ్ అశ్విన్ మరోసారి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాస్‌తో చేయబోయే సినిమాకు సంబంధించి కొన్ని ముచ్చట్లు చెప్పాడు. ఈ సినిమాలో తెరపై చూడబోయే ప్రతి విషయం కొత్తదే అన్నాడు. దీని కోసం ప్రపంచ స్థాయి సెట్టింగ్స్ సిద్ధమవుతున్నాయని.. అవి అద్భుతంగా ఉంటాయని.. తెర మీద సినిమా చూసే ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని నాగ్ అశ్విన్ తెలిపాడు.

ఈ సినిమా ఆలస్యం అవుతోందని, తాను చాలా సమయం పెట్టాల్సి వస్తోందన్న భావన తనకు ఎంతమాత్రం లేదని.. నిజానికి భారీగా ప్రి ప్రొడక్షన్ వర్క్ అవసరమైన ఈ చిత్రానికి ఇంత సమయం దక్కడం పట్ల సంతోషంగా ఉన్నానని నాగ్ అశ్విన్ అన్నాడు. కొవిడ్ నేపథ్యంలో సినిమా పట్టాలెక్కడానికి ఇంకొంత ఆలస్యం కావచ్చని, కానీ ఈ ఏడాదే సినిమా మొలవుతుందని అతను వెల్లడించాడు.