కరోనా కల్లోలం.. వైద్యురాలి వీడియో వైరల్

గత ఏడాది ఈ సమయానికి కరోనా భయంతో జనాలు ఎలా వణికిపోయారో తెలిసిందే. లాక్ డౌన్ దెబ్బకు అందరూ ఇంటిపట్టునే ఉంటూ కరోనా కల్లోలం గురించి తెలుసుకుంటూ బయటికి అడుగు పెట్టాలంటే భయపడిపోయారు. ఎక్కడ ఏది ముట్టుకోవాలన్నా.. ఎవరిని కలవాలన్నా.. ఏం చేయాలన్నా అనుమానమే. కానీ తర్వాత నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. కరోనా ప్రభావం తగ్గుతూ రావడంతో జనాల్లో భయం పోయింది.

సెకండ్ వేవ్ విజృంభిస్తోందన్నా జనాల్లో ఒకప్పటిలా భయం కలగలేదు. కానీ చూస్తుండగానే పరిస్థితులు వేగంగా మారిపోయాయి. వైరస్ తీవ్రత గత ఏడాదితో పోలిస్తే బాగా ఎక్కువైపోయింది. ఒక సమయంలో గరిష్టంగా ఇండియాలో రోజుకు లక్ష కేసులు నమోదైతే.. ఇప్పుడు ఆ సంఖ్య 3 లక్షలకు దాటిపోయింది. జనాలు కరోనా ధాటికి పిట్టల్లా రాలిపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. మరణాల గురించి ప్రభుత్వాలు సరైన సమాచారం ఇవ్వట్లేదు.

తక్కువ వయసున్న వాళ్లు, పూర్తి ఆరోగ్యంతో కనిపిస్తున్న వాళ్లు సైతం పెద్ద ఎత్తున కరోనా ధాటికి బలైపోతుండం గమనార్హం. కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ముంబయికి చెందిన ఓ వైద్యురాలు తీవ్ర భావోద్వేగంతో రిలీజ్ చేసిన వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. ముంబయిలోని డాక్టర్ తృప్తి గిలాడా అనే వైద్యురాలు తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదంటూ ఆమె కరోనా తీవ్రతను తెలియజేసే ప్రయత్నం చేసింది.

ఆసుపత్రుల్లో రోగులు కరోనాతో విషమ పరిస్థితుల్లో అల్లాడిపోతున్నా.. వైద్యులుగా తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు ఆమె వెల్లడించింది. బాధతో గుండె బద్దలైపోతోందని.. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆ వైద్యురాలు పేర్కొంది. వీడియోలు పలుమార్లు ఆమె ఎమోషన్ ఆపుకోలేక ఏడ్చేశారు. 34 ఏళ్ల యువకుడు కరోనా సోకి, వెంటిలేటర్ మీద ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటున్నాడని.. వైరస్ ఏ వయసు వాళ్లనూ వదలట్లేదని.. బయటకు వెళ్లినపుడు కచ్చితంగా మాస్క్ ధరించాలని.. ఇప్పటిదాకా కరోనా సోకని వారు తమను తాము సూపర్ హీరోలుగా భావిస్తే, వైరస్ సోకి కోలుకున్న వాళ్లు తాము ఇక అపాయం నుంచి తప్పించుకున్నట్లు భావిస్తే అంతకంటే తప్పిదం మరొకటి ఉండదని.. అందరూ జాగ్రత్తగా లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె స్పష్టం చేశారు.