తిరుప‌తి వైసీపీకి క‌ష్ట‌మే… రీజ‌న్లు ఇవే ?

ఏపీలో తిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌పై వైసీపీ నేత‌లు ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ నూటికి నూరు శాతం ఫ‌లితాలు ( తాడిప‌త్రి మిన‌హా) సాధించింది. ఈ ఊపులో తిరుప‌తిలో తిరుగులేని మెజార్టీ సాధించి త‌మ స‌త్తాను ఢిల్లీ స్థాయిలో చాటుకోవాల‌ని ఆ పార్టీ అధిష్టానం ఉబ‌లాట ప‌డిన మాట వాస్త‌వం. ఈ ఉప ఎన్నిక‌ను బీజేపీ కూడా చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో బీజేపీకే త‌మ అస‌లు సిస‌లు దెబ్బేంటో చూపించాల‌ని వైసీపీ డిసైడ్ అయ్యింది. ఇక బీజేపీ టీడీపీని మూడో ప్లేస్‌లోకి నెట్టేసి.. రెండో స్థానంలో నిలిచి వైసీపీకి అస‌లు సిస‌లు ప్ర‌త్య‌ర్థి తామే అని చూపించుకోవాల‌ని ఇక్క‌డ క‌సితోనే ప‌ని చేసింది.

ఇక ఎన్నిక‌ల హ‌డావిడి ముందు వ‌ర‌కు 3 ల‌క్ష‌ల మెజార్టీ అంటూ బాకాలు ఊదుకున్న వైసీపీ నేత‌లు.. చివ‌ర‌కు పోలింగ్ ముందు నాటికి 5 ల‌క్ష‌ల మెజార్టీ టార్గెట్ అంటూ ఒక్క‌టే హ‌డావిడి చేశారు. అయితే పోలింగ్ ముగిశాక వైసీపీ వాళ్ల మొహాలు మాడిపోయాయి. తిరుపతిలో మెజారిటీపై వైసీపీ నేతలు పెట్టుకున్న ఆశలు ఫలించేట్లు లేవు. దీనికి ప్రధాన కారణం తక్కువ శాతం పోలింగ్ నమోదు కావడమే. జ‌గ‌న్ స్వ‌యంగా ఈ ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అక్క‌డితో ఆగ‌కుండా ఆయ‌న ఏకంగా 5 ల‌క్ష‌ల మెజార్టీ రావాల‌ని వాళ్ల‌కు టార్గెట్ పెట్టారు.

తీరా పోలింగ్ స‌ర‌ళి చూశాక‌.. 5 ల‌క్ష‌లు మెజార్టీ కాదు క‌దా.. 3 ల‌క్ష‌లు.. ఇంకా చెప్పాలంటే 2019 ఎన్నిక‌ల్లో వ‌చ్చిన 2.28 ల‌క్ష‌ల మెజార్టీ అయినా వ‌స్తుందా ? అన్న సందేహాలు వైసీపీ వాళ్ల‌లోనే తీవ్రంగా ఉన్నాయి. జ‌గ‌న్ సైతం 5 ల‌క్ష‌ల మెజార్టీతో బీజేపీ ఢిల్లీ నాయ‌క‌త్వానికి కూడా త‌మ ద‌మ్మేంటో చూపాల‌నే అనుకున్నారు. అయితే పోలింగ్ శాతం ఈ ఉత్సాహం మీద నీళ్లు చ‌ల్లేసింది. ఇక్క‌డ 2019 ఎన్నికల్లో 79.76 శాతం పోలింగ్ నమోదయింది. అప్పుడు 13 ల‌క్ష‌ల ఓట్లు ఉంటే వైసీపీ నుంచి గెలిచిన దుర్గా ప్ర‌సాద్‌కు 2.28 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది.

ఇప్పుడు మొత్తం 17 ల‌క్ష‌ల ఓట్లు ఉంటే 63 శాతం పోలింగ్ మాత్ర‌మే న‌మోదు అయ్యింది. అంటే 10 ల‌క్ష‌ల ఓట్లు మాత్ర‌మే పోల‌య్యాయి. ట్ర‌యాంగిల్ ఫైట్‌లో టీడీపీ కూడా అంచ‌నాల‌కు మించి గ‌ట్టి పోటీ ఇచ్చింద‌నే అంటున్నారు. ఇక బీజేపీకి ప‌డే ఓట్లు కూడా తీసేస్తే వైసీపీ 2019లో వ‌చ్చిన మెజార్టీ తెచ్చుకుంటే గొప్పే అంటున్నారు. ఏదేమైనా ఓట‌ర్ల ఆనాస‌క్త‌త వైసీపీ ఆశ‌ల‌పై నీళ్లు కుమ్మ‌రించేసింది.