కియా రీస్టార్ట్.. గంటకు 30 కార్లు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ స్టేటస్ ఎలా ఉన్నప్పటికీ.. పనులు మాత్రం మొదలైపోయాయి. పరిశ్రమలకు కొన్ని రోజుల కిందటే అనుమతులు ఇవ్వడం, పాక్షికంగా పనులు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించడంతో చాలా ఇండస్ట్రీలు రీస్టార్ట్ అయ్యాయి. తాజాగా ప్రతిష్టాత్మక కియా కార్ల సంస్థలోనూ పనులు పున:ప్రారంభమయ్యాయి.

అనంతపురంలో జిల్లాలో చంద్రబాబు సర్కారు హయాంలో ఏర్పాటైన ఈ పరిశ్రమ జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక కొన్ని ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. తర్వాత అంతా సెట్ రైట్ అయింది. లాక్ డౌన్ కారణంగా ఈ పరిశ్రమ దాదాపు రెండు నెలలుగా మూసి ఉంది. మంగళవారం పరిశ్రమలో పనులు మళ్లీ మొదలయ్యాయి. గతంలో పరిశ్రమలో 4500 మంది పని చేస్తుండగా.. ప్రస్తుతం మొత్తం అందరితోనూ పనులు చేపట్టే అవకాశం లేకపోవడంతో సంఖ్య తగ్గించారు.

కేవలం వెయ్యి మందితోనే యాజమాన్యం ఉత్పత్తిని పున:ప్రారంభించింది. కియాలో ఒకప్పుడు గంటలకు 50 కార్లు ఉత్పత్తి అయ్యేవి. ఐతే సిబ్బంది నాలుగో వంతు కన్నా తగ్గినప్పటికీ కార్ల ఉత్పత్తి ఆ స్థాయిలో తగ్గలేదు. ప్రస్తుతం గంటకు 30 కార్లు ఉత్పత్తి అవుతున్నాయి. కరోనా నేపథ్యంలో మొత్తం పరిశ్రమను శానిటైజ్ చేసి.. కార్మికులు మాస్కులు, గ్లౌజులు తొడుక్కుని భౌతిక దూరం పాటిస్తూ పనులు సాగిస్తున్నారు.

ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న కార్లను చెన్నై నుంచి ఓడరేవు ద్వారా శ్రీలంకకు ఎగుమతి చేస్తున్నట్లు కియా ప్రతినిధులు తెలిపారు. బాబు హయాంలో ఏపీకి వచ్చిన అతి పెద్ద పరిశ్రమ కియానే. నిరుడు జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక కొన్ని ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో పరిశ్రమను ఇక్కడి నుంచి తమిళనాడుకు తరలించబోతున్నట్లు గట్టి ప్రచారం జరిగింది. కానీ తర్వాత అదేమీ లేదని ఈ దక్షిణ కొరియా సంస్థ ప్రకటించింది.