శంకర్ ఇలా చేస్తున్నాడేంటి?


సౌత్ ఇండియన్ ఏస్ డైరెక్టర్ శంకర్ శైలి గురించి అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలు తీసే విషయంలో హడావుడి పడడు. ఒక సినిమా అయ్యాకే ఇంకో సినిమా మొదలుపెడతాడు. తన ఫోకస్ ఏమాత్రం పక్కకు పోకుండా.. అప్పటికి చేస్తున్న సినిమా మీదే ఉండేలా చూసుకుంటాడు. ఒక సినిమా చేస్తుండగా.. ఇంకో సినిమా స్క్రిప్టు మీద వర్క్ చేయడం కూడా జరగదని అంటారు. ఇన్నేళ్లూ అలాగే చేస్తూ వచ్చిన శంకర్.. ఇప్పుడు ఉన్నట్లుండి రూటు మార్చేస్తున్నాడు.

‘ఐ’ తర్వాత ఆయన ‘ఇండియన్-2’ సినిమా తీయడానికి సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. రకరకాల కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యమైంది. కమల్ పొలిటికల్ కమిట్మెంట్లు.. షూటింగ్‌లో క్రేన్ ప్రమాదం.. కరోనా.. ఇలా ఆ సినిమా వెనక్కి వెళ్లడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఐతే ఏ విషయంలోనూ నిర్మాతల్ని తప్పుబట్టడానికి కూడా లేదు. నిజానికి ఈ సినిమా పున:ప్రారంభం కాకపోవడానికి ప్రధాన కారణం కమల్ అంటారు. కానీ గొడవ పడిందేమో నిర్మాతలు, శంకర్.

‘ఇండియన్-2’ సంగతి ఎటూ తేల్చకుండానే రామ్ చరణ్‌తో శంకర్ సినిమా అనౌన్స్ చేశాడు. ఆ సినిమా జులైలో సెట్స్ మీదికి వెళ్తుందని కూడా నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ‘ఇండియన్-2’ సంగతి తేల్చకుండా శంకర్.. చరణ్ సినిమా మీదికి వచ్చేస్తున్నాడేంటి అని కోలీవుడ్ జనాలు ఆశ్చర్యపోయారు. ఇది కరెక్ట్ కాదన్న వాళ్లూ ఉన్నారు. ఇదే మింగుడు పడకుండా ఉంటే.. ఇప్పుడేమో శంకర్ బాలీవుడ్ బాట పడుతున్నాడు. ఓవైపు ‘ఇండియన్-2’, ఇంకోవైపు చరణ్ సినిమాను పెట్టుకుని.. ‘అపరిచితుడు’ రీమేక్ అంటూ లైన్లోకి వచ్చాడు శంకర్. రణ్వీర్ సింగ్ హీరోగా ‘అపరిచితుడు’ కొత్త వెర్షన్ తీయబోతున్నాడట. మళ్లీ ఇదేమో పాన్ ఇండియా సినిమా అంటున్నారు.

‘అపరిచితుడు’ సౌత్ ఇండియా అంతటా ఇరగాడేసింది. హిందీలోనూ పెద్ద ఎత్తునే రిలీజ్ చేశారు. థియేటర్లలో చూడకపోయినా.. టీవీల్లో, ఇంటర్నెట్లో ఈ సినిమాను అక్కడ కూడా బాగానే చూశారు. ఇలాంటి సినిమాను శంకర్ ఇప్పుడు రీమేక్ చేయాలనుకోవడం, పైగా వేరే ప్రాజెక్టులు వేచి చూస్తున్న సమయంలో మధ్యలోకి తెచ్చి ఇరికించడం ఏంటో అంతు బట్టడం లేదు. ఈ ప్రాజెక్టు పట్ల ఎవరిలోనూ పెద్దగా ఎగ్జైట్మెంట్ అయితే కనిపించడం లేదు. మరి చేతిలో ఉన్న మూడు సినిమాల్లో శంకర్ దేన్ని ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి.