హోంగార్డు భార్య‌ను చంపిన కేసులో.. ట్విస్టుల మీద ట్విస్టులు

విజ‌య‌వాడలో హోంగార్డు చేతిలో ఆయ‌న భార్య హ‌త్య‌కు గురైన సంఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ కేసులో అనేక ట్విస్టులు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ముందు.. అస‌లు మిస్ ఫైర్ అయింద‌ని పోలీసులు భావించారు. ఈ క్ర‌మంలోనే హోంగార్డు తుపాకీ నుంచి వ‌చ్చిన బుల్లెట్‌.. త‌గిలి ఆయ‌న భార్య సూర్య ర‌త్న ప్ర‌భ మ‌ర‌ణించార‌ని పోలీసులు అనుకున్నారు. కానీ, కొంత మేర‌కు విచారించ‌గా.. ఆయ‌నే స్వ‌యంగా కాల్చార‌ని.. సాక్షాత్తూ ఉన్న‌తాధిక‌రులు వెల్ల‌డించారు. దీంతో కుటుంబ క‌ల‌హాలు.. అప్పులు.. న‌గ‌లు తాక‌ట్టు పెట్టే విష‌యం.. వాటిలో ఘ‌ర్ష‌ణ జ‌రిగి.. భార్య‌ను హోంగార్డే కాల్చి చంపాడ‌ని తేల్చారు.

అయితే.. ఇప్పుడు ఈ కేసులో పెద్ద ట్విస్ట్ తెర‌మీద‌కి వ‌చ్చింది. హోంగార్డు వినోద్‌కుమార్ మంచి వాడ‌ని, అన్నెపున్నెం ఎరుగ‌ని వాడ‌ని ఆయ‌న అత్త‌గారు, సాక్షాత్తూ సూర్య ర‌త్న ప్ర‌భ త‌ల్లి కితాబు నివ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ‘నా అల్లుడు చాలా మంచోడు’ అని మీడియా ముందు వినోద్‌కుమార్‌ అత్త వరలక్ష్మి చెప్పింది.

సూర్యరత్నప్రభను అత్తమామలు కూడా సొంత కూతురిలా చూసుకునేవారని ఆమె చెప్పింది. నిందితుడి పెద్దత్త, అతడి మేనత్త కూడా ఇదే మాట చెబుతున్నారు. “వినోద్‌కుమార్‌ తన అధికారిని ఇంటి వద్ద దించిన తర్వాత భవానీపురంలో ఇంటికి వచ్చాడు. తర్వాత బ్యాగ్‌ను టేబుల్‌పై పెట్టి స్నానానికి వెళ్లాడు. బ్యాగ్‌ను చూస్తున్న మా అమ్మాయికి పిస్టల్‌ కనిపించింది. దాన్ని బయటకు తీసి చూడగా, జారి కింద పడింది. అది పేలడంతో బుల్లెట్‌ భుజానికి తగిలింది” అని మృతురాలి తల్లి వరలక్ష్మి చెప్పింది.

అయితే.. వీళ్లు ఇలా చెబుతున్నా.. కేసులో మాత్రం అనేక ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. జనవరిలో భార్య బంగారు ఆభరణాలను మణప్పురం బ్యాంక్‌లో తాకట్టుపెట్టి, వినోద్‌కుమార్‌ రుణం తీసుకున్నాడు. ఎస్‌బీఐలో తీసుకున్న అప్పును తీర్చడానికి ఈ వస్తువులను తాకట్టు పెట్టాడని చెబుతున్నారు. పోలీసు సిబ్బందికి వేతనాలను ఐసీఐసీఐ బ్యాంక్‌ ద్వారా చెల్లిస్తున్నారు. ఈ బ్యాంక్‌ కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అందుకే ఎస్‌బీఐలో రుణం తీర్చి, ఆ ఖాతాను ఐసీఐసీఐ బ్యాంక్‌కు మార్చుకోవడానికి వినోద్‌కుమార్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఈ ఖాతా ఐసీఐసీఐ బ్యాంక్‌కు బదిలీ అయితే రూ.3 లక్షల వరకు రుణం వచ్చే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఖాతా బదిలీలో జాప్యం జరగుతుండడంతో, వచ్చే నెలలో పెద్దనాన్న కుమారుడి వివాహానికి వెళ్లాలని, ఆభరణాలు కావాలని భార్య నిలదీసిందని అంటున్నారు. ఆదివారం రాత్రి ఈ విషయమై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగిందని, ఆవేశంలో వినోద్‌కుమార్‌ భార్య ప్రాణాలు తీసి ఉంటాడని భావిస్తున్నారు. హోంగార్డే ఈ హత్య చేశాడని పోలీసులు చెబుతుండగా, మృతిరాలి కుటుంబీకులు అతడికి క్లీన్‌చిట్‌ ఇవ్వడం గమనార్హం. మొత్తానికి అత్యంత కీల‌క‌మైన కేసులో.. అత్తింటి వారే.. అల్లుడికి స‌పోర్టు చేయ‌డం విశేషం. మ‌రి రాబోయే రోజుల్లో మ‌రెన్ని మ‌లుపులు తిరుగుతుందోచూడాలి.