వీరప్పన్ డెన్ లో భారీ నిధి.. రివీల్ చేసిన సొంతకుమార్తె

కొత్త రహస్యం బయటకు వచ్చింది. తమిళనాడు.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల్ని హడలెత్తించిన చందనపు దొంగ వీరప్పన్ కు సంబంధించిన ఒక రహస్యాన్ని వెల్లడించింది ఆయన కుమార్తె. తరచూ ఏదో ఒక విషయం మీద వార్తల్లోకి వచ్చే వీరప్పన్.. అప్పట్లో భారీ ఎత్తున చందనపు దుంగలు.. ఏనుగు దంతాల్ని స్మగ్లింగ్ చేయటం తెలిసిందే. అతడి కోసం వేటాడిన పోలీసులు 2004లో అతన్ని ఎన్ కౌంటర్ లో కాల్చి చంపటం తెలిసిందే.

వీరప్పన్ సతీమణి ముత్తులక్ష్మీ.. కుమార్తెలు విద్యా రాణి.. విజయలక్ష్మిలు ఉన్నారు. విద్యారాణి బీజేపీ మహిళా యువజన నేతగా ఉంటే.. విజయలక్ష్మి తమిళర్ వాల్మురిమై కట్చిలో పని చేస్తున్నారు. తాజాగా చందనపు దొంగ జీవితం మీద ఒక చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర పోస్టర్లు.. టీజర్లు వీరప్పన్ గుర్తుకు వచ్చేలా ఉన్నాయి. దీంతో.. మరోసారి వీరప్పన్ వార్తల్లోకి వచ్చారు.

అయితే.. ఈ సినిమాకు.. వీరప్పన్ కు ఏ మాత్రం సబంధం లేదని ఆయన కుమార్తె స్పష్టం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడిన ఆమె మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన చిత్రంగా చెప్పారు. తనకు తన తండ్రి అంటే ఎంతో ఇష్టమని..ఆయన సత్యమంగళం అడవుల్లోనే ఎక్కువ కాలం గడిపిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అడవుల్లోనే అతి పెద్ద నిధిని దాచి పెట్టినట్లుగా ఆమె రివీల్ చేశారు. దాన్ని కనిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నిధి గురించి తెలిసిన తన తండ్రి.. ఆయన అనుచరులు ఈ లోకంలో లేరని.. దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.