టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ అజ్ఞాత వాసం..

టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ.. విజ‌య‌వాడ‌కు చెందిన కేశినేని నాని ఏమ‌య్యారు ? ఎక్క‌డ ఉన్నారు ? అనే ప్ర‌శ్న‌లు విజ‌య‌వాడ రాజ‌కీ యాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇటు పార్టీలోను, అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఎంపీ కేశినేని నానికి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఆయ‌న ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. రాజ‌కీయంగా హీటెక్కించ‌డం తెలిసిందే. ఇదే ప‌రిస్థితి సొంత పార్టీలోనూ ఆయ‌న అవలంభించారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడి… నాని ఎంపీగా రెండోసారి గెలిచిన‌ప్ప‌టి నుంచి నాని సొంత పార్టీ నేత‌ల‌నే లెక్క చేయ‌డం లేదు. దీంతో చోటా నేత‌ల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు కూడా నానికి దూర‌మ‌య్యారు. ఇక‌, ఇటీవ‌ల జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో విజ‌యవాడలో ఆయ‌నే అంతా అయి.. టీడీపీని న‌డిపించారు.

పార్టీకి కీల‌క‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీ వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కుల‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోలేదు. పైగా నేనే గెలిపించుకుంటాను.. విజ‌య‌వాడ‌లో పాగా వేయ‌డంఖాయం అంటూ.. నాని చేసిన వ్యాఖ్య‌లు కూడా పార్టీలో అంత‌ర్గ‌త విభేదాల‌కు కార‌ణంగా మారాయి. ఆయ‌న కుమార్తె కేశినేని శ్వేత‌ను ఆయ‌న‌కు ఆయ‌నే మేయ‌ర్ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించేసుకున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో నేత‌లు క‌లిసిరాలేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో తీవ్ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు సైతం సంధించుకుని.. పార్టీ పరువును బ‌జారుకీడ్చార‌నే పేరు కూడా వ‌చ్చింది.

ఇక‌, కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ దూకుడు చూపించి.. గెలుపు గుర్రం ఎక్కింది. దీంతో ఎంపీ బింకం అంతా ఎన్నిక‌ల్లో తేలిపోయింది. పార్టీ ఓట‌మి త‌ర్వాత‌.. ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇక‌, విజ‌య‌వాడ రాజ‌కీయాల్లోనూ ఆయ‌న ఎక్క‌డా నోరు విప్ప‌డం లేదు. తాజాగా తిరుప‌తి పార్ల‌మెంటు ఉప ఎన్నిక‌లో ప్ర‌చారం నిర్వ‌హించేందుకు పార్టీ అదిష్టానం నుంచి పిలుపు వ‌చ్చినా.. కేశినేని మాత్రం పెద్ద‌గా స్పందించ‌లేదు. పైగా ఆయ‌న బెంగ‌ళూరులో మ‌కాం వేశార‌ని.. విజ‌య‌వాడ‌లో ప్ర‌చారం సాగుతోంది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో నానితో స‌హ‌క‌రించేందుకు టీడీపీ స్థానిక నేత‌లు కూడా ఉత్సాహం చూపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ నేప‌థ్యంలో నాని ఎవ‌రికీ మొహం చూపించ‌లేక‌పోతున్నార‌ని.. పార్టీ అధినేత కు వివ‌ర‌ణ ఇవ్వాల్సి రావ‌డం కూడా ఆయ‌న‌కు త‌ల‌కు మించిన భారంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి ఆయ‌న దూకుడు రాజ‌కీయం.. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న‌కు.. పార్టీకి కూడా తీవ్ర దెబ్బేసింద‌ని.. గెలిచే చోట కూడా పార్టీ ఓడిపోయింద‌ని అంటున్నారు. మ‌రి ఎంపీగారు రియ‌లైజ్ అవుతారో లేదో చూడాలి.