సైకిల్ గుర్తుకు ఓటేయాలన్న వైసీపీ ఎమ్మెల్యే.. జోక్ చేశానంటూ కవరింగ్

ఎన్నికల ప్రచారం సందర్భంగా కొన్ని సిత్రాలు చోటు చేసుకుంటాయి. రాజకీయ నేతలకు ఉండే సమస్య ఏమంటే.. వారి నోటి నుంచి ప్రతి మాటా ఆచితూచి అన్నట్లుగా ఉండాలి. సామాన్యుల మాదిరి ఒక మాట ఎక్కువ తక్కువలు వచ్చినా చిక్కే. చిన్న తేడా వచ్చినా అడ్డంగా బుక్ కావటం ఖాయం. ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితినే కొని తెచ్చుకున్నారు పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పాల వాసుబాబు.

ప్రస్తుతం ఏపీలో ఎంపీటీసీ.. జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి వెళ్లిన వాసుబాబు.. గోపీనాథపట్నంలో ప్రచారానికి వెళ్లారు. వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి జయలక్ష్మి.. ఎంపీటీసీ అభ్యర్థి గంటా శ్రీలక్ష్మితరఫున ప్రచారాన్ని నిర్వహిస్తూ.. ఆ ఇద్దరు అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతూ.. సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

ఎమ్మెల్యే నోటి నుంచి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్న మాట వచ్చినంతనే.. చుట్టు ఉన్న వారిలో కలకలం. ఎమ్మెల్యే మాట్లాడిన తప్పు మాటను గుర్తించిన ఒక అభ్యర్థి ఏకంగా తల పట్టుకున్న పరిస్థితి. నాలుక జారి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలన్న ఎమ్మెల్యే వాసుబాబు.. వెంటనే తేరుకొని.. ఎన్నికల నుంచి పారిపోయిన పార్టీ గుర్తుకు వచ్చి అలా అన్నానని.. సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలంటూ జోక్ చేశానని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తాను తప్పు మాట్లాడినట్లు గుర్తించి సారీ చెప్పేసిన ఆయన.. తర్వాతి సంభాషణలో మాత్రం కవరింగ్ ఇవ్వటంతో అక్కడున్న వారంతా ఎమ్మెల్యేగారి మాటలకు ముసిముసి నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సైకిల్ గుర్తుకు ఓటేయాలన్న ఎమ్మెల్యే మాటల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వింటే ఎలా రియాక్టు అవుతారో?