కోటి రూపాయల చెక్కులు ఇచ్చేశారు

విశాఖపట్నం గ్యాస్ లీక్ ఉందంతం తాలూకు విషాదం గురించి చెప్పడానికి మాటలు రావు. 12 మందిని పొట్టన పెట్టుకున్న ఆ ఉదంతం.. వందల మందిని అస్వస్థతకు గురి చేసింది. ఐతే ఈ విషాదంపై వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ ఘటన జరిగిన రోజు మధ్యాహ్నమే మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున భారీ నష్టపరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ పరిహారం అంటే పది లక్షలో.. పాతిక లక్షలో ప్రకటిస్తారని అంతా అనుకున్నారు కానీ.. ఏకంగా కోటి రూపాయల కాంపెన్జేషన్ అనేసరికి అందరూ షాకయ్యారు. కోటి రూపాయలు ఇచ్చినా బాధిత కుటుంబాల బాధ పోదు కానీ.. ప్రభుత్వ పరంగా ఇది పెద్ద సాయమే. ఐతే ఈ పరిహారం కోసం నెలలు, సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం బాధితులకు లేకుండా చూసింది ప్రభుత్వం.

మొన్న ఎల్జీ పాలిమర్స్ సంస్థ ముందు బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన నేపథ్యంలో ప్రభుత్వం ఇంకెంతమాత్రం ఆలస్యం చేయకుండా బాధితుల కోసం చెక్కులు రెడీ చేసింది. మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు సోమవారం చెక్కులు తీసుకెళ్లి బాధితులకు పంపిణీ చేశారు.

కంపెనీ నిర్లక్ష్యం, దానిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతోంది అన్నది పక్కన పెడితే.. ఈ ఘోరం చోటు చేసుకున్న నాలుగో రోజుకే బాధితులకు రూ.కోటి చొప్పున చెక్కులు పంపిణీ చేయడం మాత్రం అభినందనీయం.

మరోవైపు గ్యాస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లోకి జనాలను ఇంకా అనుమతించడం లేదు. శానిటైజేషన్ పూర్తి స్థాయిలో చేసి, పరిసర ప్రాంతాలు పూర్తి సురక్షితం అని నిర్ధరించాకే ప్రజల్ని అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్యాస్ ప్రభావం నేపథ్యంలో ఇళ్లలోని నిత్యావసరాలన్నీ బయట పడేయక తప్పదని అంటున్నారు నిపుణులు.