బీజేపీ దిశ‌గా రాయ‌పాటి అడుగులు.. రీజ‌నేంటంటే..!

ఏ ఎండ‌కు ఆగొడుగు ప‌ట్ట‌డం అనేది రాజ‌కీయాల్లో నేత‌ల‌కు కామ‌నే! అస‌లు రాజ‌కీయాల్లో ఎవ‌రూ శాశ్వ‌‌త మిత్రులు కానీ, శాస్వ‌త శ‌త్రువులు కానీ .. ఉండ‌రు. అవ‌స‌రం-అవ‌కాశం-అధికారం అనే ఈ మూడు సూత్రాల ప్రాతిప‌దిక‌గానే నాయ‌కులు ముందుకు సాగుతుంటారు. ఇప్పుడు ఇదే పార్ములాతో .. ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు మాజీ ఎంపీ.. రాజ‌కీయ కురువృద్ధుడు.. రాయ‌పాటి సాంబ‌శివ‌రావు విష‌యంలో వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయంగా చాలా క్లిష్ట‌మైన ప‌రిస్థితిలో ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న‌కు ముందు ద‌శాబ్దాల పాటు ఆయ‌న కాంగ్రెస్‌లో చ‌క్రం తిప్పారు.

విభ‌జ‌న నేప‌థ్యంలో టీడీపీలోకి వ‌చ్చి.. న‌ర‌స‌రావు పేట నుంచి పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఈ క్ర‌మంలో ఆయ‌న టీడీపీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. వ్యాపార ప‌రంగా.. ఆర్థికలావాదేవీల ప‌రంగా .. ఆయ‌న‌కు పార్టీ పెద్ద‌గా అండ‌నివ్వ‌డం లేద‌ని అంటున్నారు రాయ‌పాటి అనుచ‌రులు. ముఖ్యంగా త‌న అల్లుడి భాగ‌స్వామ్యంతో న‌డుస్తున్న ట్రాన్స్‌ట్రాయ్ నిర్మాణ కంపెనీ.. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంది. ఈ క్ర‌మంలో వాటిని చెల్లించ‌డం లేదంటూ.. స‌ద‌రు బ్యాంకులు.. ఫిర్యాదు చేయ‌డంతో ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు ఇటీవ‌ల రాయ‌పాటి నివాసాల‌పై దాడులు చేశారు.

బ్యాంకులకు ఎగ్గొట్టింది రూ. 10,115 కోట్లు అని తాజాగా ఈ సంస్థలు లెక్కలు తేల్చాయి. వివిధ ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకోవడం.. వాటిని వేరే కంపెనీలు పెట్టి దారి మళ్లించడం వంటివి చేశారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దర్యాప్తులో తేలింద‌ట‌. మొత్తంగా ఈడీ దర్యాప్తుచేసిన మొత్తానికి అటూ ఇటూ మొత్తమైనా ట్రాన్స్‌స్ట్రాయ్ సంస్థ రుణాలుగా తీసుకుని ఎగ్గొట్టింద‌ని అంటున్నారు. ఆ సొమ్ములన్నీ ఎటు పోయాయన్నది ఇప్పుడు తేల్చాల్సింది ఈడీ, సీబీఐలే. ఇప్పటికే రాయపాటిపై సీబీఐ కేసులు నమోదయ్యాయి. ఒకటికి రెండు సార్లు వచ్చి సోదాలు చేసి కూడా పోయారు.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆర్థికంగా త‌న‌ను కాపాడే పార్టీ.. బ‌ల‌మైన వాయిస్ ఉన్న పార్టీ త‌న‌కు అవ‌స‌రం అనేది రాయ‌పాటి ఆలోచ‌న‌. విభ‌జ‌న‌కు ముందు వ‌ర‌కు కాంగ్రెస్‌లో ఉండ‌డంతో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు చేసినా. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న వ్యాపారాలు సాగిపోయాయి. కానీ, ఇప్పుడు ఏపీలో పాగా వేయాల‌ని భావిస్తున్న కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు.. ఇక్క‌డి నేత‌ల‌కు సామ‌దాన‌భేద దండోపాయాల‌తో లోబ‌రుచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో ఇప్ప‌టికే చాలా మంది ఆర్థిక లావాదేవీల్లో ఈడీ. ఐటీ దాడులు ఎదుర్కొన్న సీఎం ర‌మేష్‌, సుజ‌నా చౌద‌రి వంటివారు టీడీపీకి బై చెప్పి.. క‌మ‌లం గూటికి చేరిపోయారు.

ఈ క్ర‌మంలో రాయ‌పాటి కూడా బీజేపీ గూటికి చేరితే.. ఈ త‌ల‌నొప్పులు త‌ప్పుతాయ‌ని ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఇది ఆలోచ‌న‌గా ఉంద‌ని.. తిరుప‌తి ఉప ఎన్నిక త‌ర్వాత‌.. బీజేపీ నేత‌ల‌తో చ‌ర్చించి.. నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని.. రాయ‌పాటి గురించి బాగా తెలిసిన వారు చెబుతున్న మాట‌. సో.. రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు క‌నుక‌.. రాయ‌పాటి బీజేపీ గూటికి చేరినా ఆశ్చ‌ర్య పోవాల్సిన అవ‌స‌రం లేదు.